Share News

Gujarat security: సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన గుజరాత్

ABN , First Publish Date - 2023-10-21T20:58:39+05:30 IST

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నిరోధానికి, సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Gujarat security: సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన గుజరాత్

అహ్మదాబాద్: రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దుల వద్ద భద్రతను గుజరాత్ (Gujarat) ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ కరెన్సీ నిరోధానికి, సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా కోసం ఈ చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.


48 సరిహద్దు చెక్ పోస్టులు

పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న గుజరాత్‌లోని పలు జిల్లాల సరిహద్దుల్లో 48 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారిక ప్రకటన వెల్లడించింది. సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను, అక్రమ సరఫరాలను నిరోధించడంపై ఈ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు డేగ కన్ను వేసి ఉంచుతారు. గుజరాత్‌లోని బనస్‌కాంత, సబర్‌కాంత, ఆర్వల్లి, దహోడ్, మహిసాకర్ జిల్లాలు రాజస్థాన్‌తోనూ , దహోడ్, ఛోటా ఉడెపూర్ జిల్లాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంతోనూ సరిహద్దులను పంచుకుంటున్నాయి. గుజరాత్ డీజీపీ (శాంతి భద్రతల విభాగం) ఆదేశాల ప్రకారం మొత్తం 48 చెక్‌పోస్టులలో రాజస్థాన్‌తో పంచుకుంటున్న సరిహద్దుల్లో 37 చోట్ల, మధ్యప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకుంటున్న 11 చోట్ల ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల తేదీల ప్రకారం మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరుగనుంది. ఈ రెండింటితో పాటు నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-10-21T20:58:39+05:30 IST