Delhi Liquor Scam: నాపై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు: ఆప్ ఎంపీ
ABN , First Publish Date - 2023-05-02T15:42:37+05:30 IST
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం అనుబంధ ఛార్జిషీటులో..
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor policy) కుంభకోణం అనుబంధ ఛార్జిషీటులో 'ఆప్' రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరు చోటుచేసుకుందంటూ మీడియాలో వచ్చిన వార్తాలను ఆయన ఖండించారు. ఇవి నిర్ధారణ చేసుకోకుండా వచ్చిన వార్తలనీ, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రచారమని అన్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో జరిగిన సమావేశంలో చద్దా కూడా పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థకు మాజీ కార్యదర్శి సి.అరవింద్ తెలిపారు. దీంతో ఈడీ అనుబంధ ఛార్జిషీటులో చద్దా పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై చద్దా ఘాటుగా స్పందించారు. ఈడీ ఛార్జిషీటులో తన పేరు చోటుచేసుకున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని అన్నారు. నిందితుడిగా తన పేరు లేదని, కనీసం ఈడీ ఫిర్యాదులో అనుమానితుడిగా కూడా తాను లేనని అన్నారు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, మీడియా ఎలాంటి నిర్దారణ లేకుండా వార్తలు రాయడం సరికాదని అన్నారు. ఇలాంటి దుష్ప్రచారం సాగించే వారిపై లీగల్ చర్యలు తీసుకుంటానని ఆయన ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.