India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

ABN , First Publish Date - 2023-05-17T10:44:28+05:30 IST

రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేసి, దానిని మన దేశంలో రిఫైన్ చేసి, విదేశాలకు అమ్ముతుండటంపై యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెప్ బొర్రెల్

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..
Subrahmanian Jaishankar

బ్రసెల్స్ (బెల్జియం) : రష్యా నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేసి, దానిని మన దేశంలో రిఫైన్ చేసి, విదేశాలకు అమ్ముతుండటంపై యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెప్ బొర్రెల్ (Josep Borrell) చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ఘాటుగా సమాధానం చెప్పారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ నిబంధనలను చూసుకోవాలని సలహా ఇచ్చారు. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో జైశంకర్ (స్థానిక కాలమానం ప్రకారం) మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెప్ బొర్రెల్ అంతకుముందు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రష్యా ఇంధన రంగంపై పాశ్చాత్య దేశాలు (Western nations) ఆంక్షలను కఠినతరం చేశాయని చెప్పారు. అటువంటి సమయంలో భారత దేశం రష్యా (Russia) నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేసి, డీజిల్‌తో సహా రిఫైన్డ్ ఇంధనంగా యూరోపియన్ యూనియన్‌కు అమ్ముతోందని, అందువల్ల భారత దేశంపై యూరోపియన్ యూనియన్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

బొర్రెల్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరినపుడు జైశంకర్ మాట్లాడుతూ, రష్యన్ క్రూడాయిల్‌ మూడో దేశంలో (భారత దేశంలో) పూర్తిగా మారుతోంది, దీనిని రష్యన్ చమురుగా ఎంత మాత్రం పరిగణించరని చెప్పారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 833/2014ను పరిశీలించాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో బొర్రెల్ పాల్గొనలేదు. అంతకుముందు ట్రేడ్ టెక్నాలజీ చర్చల్లో జైశంకర్‌, బొర్రెల్ పాల్గొన్నారు.

యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కాంపిటీషన్) మార్గరెత్ వెస్టాజర్ మాట్లాడుతూ, ఆంక్షలకు చట్టబద్ధత ఉండటంపై సందేహాలు లేవన్నారు. యూరోపియన్ యూనియన్, భారత దేశం మిత్రులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కరచాలనం చేసే చేయిగా ఈ చర్చలు జరుగుతాయని, వేలెత్తి చూపించే విధంగా జరగబోవని చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో భారత దేశ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

జైశంకర్ బంగ్లాదేశ్, స్వీడన్, బెల్జియం దేశాల్లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అందువల్ల రష్యాతో వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని భారత దేశంపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయని జైశంకర్ గతంలో పరోక్షంగా చెప్పారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని సమర్థించారు. యూరోపియన్ యూనియన్ తన సొంత ఇంధన అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ, అదే సమయంలో భారత దేశం వేరొక విధంగా వ్యవహరించాలని కోరుతోందని, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి :

ముస్లిం ఉపముఖ్యమంత్రి కావాలి

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

Updated Date - 2023-05-17T10:44:28+05:30 IST