Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే
ABN , Publish Date - Dec 30 , 2023 | 06:52 PM
జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి తనకు ఇంతవరకూ ఆహ్వానం అందలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారంనాడు తెలిపారు. రామలల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, లాంఛనపూర్వక ఆహ్వానం తనకు అవసరం లేదని, తన మనసుసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు యూపీలోని ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.
![Ayodhya: అయోధ్య వెళ్లడానికి ఇన్విటేషన్ అక్కర్లేదు: ఉద్ధవ్ థాకరే](https://media.andhrajyothy.com/media/2023/20231205/3dba1ee0_566d_46d6_b5d4_80a1a1994bec_e8fbb39155.jpg)
న్యూఢిల్లీ: జనవరి 22న అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) రామ లల్లా (Ram lalla) ప్రతిష్టాపన కార్యక్రమానికి తనకు ఇంతవరకూ ఆహ్వానం అందలేదని శివసేన (Shiv Sena-UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) శనివారంనాడు తెలిపారు. రామలల్లా ప్రతి ఒక్కరికి చెందిన వాడని, లాంఛనపూర్వక ఆహ్వానం తనకు అవసరం లేదని, తన మనసుసు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు యూపీలోని ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు.
అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నేతలకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్టు ఆహ్వానాలు పంపుతోంది. ఈ క్రమంలో తనకు ఆహ్వానం రాకపోవడంపై ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ, అయోధ్యలో రామాలయ ఉద్యమానికి శివసేన ఎంతో చేసిందని చెప్పారు. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అయోధ్యను సందర్శించానని తెలిపారు.
ఇది ఒక పార్టీ ఆస్తి కాదు...
ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయ ఈవెంట్గా మార్చరాదని తాను భావిస్తున్నట్టు థాకరే చెప్పారు. శ్రీరాముడు ఏ ఒక్క పార్టీ ఆస్తి కాదని, కోట్లాది మంది ప్రజల మనోభావాలకు చెందిన అంశమని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి థాకరే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని, ఇందులో కేంద్ర పాత్ర ఏమీ లేదని అన్నారు.
టాప్-10లో బాలాసాహెబ్ ఒకరు..
బాబ్రీ మసీదును1992లో కూల్చివేసిన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొ్న్న టాప్-10లో బాల్థాకరే సహా శివసైనికులు ఉన్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. బాబ్రీ కూల్చివేత కేసుకు సంబంధించి నిందితుల జాబితాలో మొత్తం 109 మంది శివసైనికులు ఉన్నారని తెలిపారు.