Share News

Diwali: నగరం నుంచి స్వస్థలాలకు 5 లక్షల మంది పయనం

ABN , First Publish Date - 2023-11-11T10:23:53+05:30 IST

దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకొని స్వస్థలాలకు వెళ్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.

Diwali: నగరం నుంచి స్వస్థలాలకు 5 లక్షల మంది పయనం

- విపరీతంగా పెరిగిన విమాన చార్జీలు

ప్యారీస్‌(చెన్నై): దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకొని స్వస్థలాలకు వెళ్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈనెల 12న ఆదివారం దీపావళి పండుగను కుటుంబసభ్యులతో కలసి ఆనందంగా జరుపుకొనేందుకు ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న ప్రజలు గురువారం సాయంత్రం నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటివరకు చెన్నై నుంచి 5 లక్షల మందికి పైగా స్వస్థలాలకు వెళ్లారు. వ్యాపారం, చదువుకొనేందుకు నగరంలో తాత్కాలికంగా స్థిరపడిన ప్రజలు సెంట్రల్‌, ఎగ్మూర్‌, తాంబరం, చెంగల్పట్టు, పెరంబూర్‌ తదితర రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ రైల్వే శాఖ 12 ప్రత్యేక రైళ్లను అన్ని జిల్లాలకు నడుపుతోంది.

కోయంబేడులో పెరిగిన రద్దీ...

కోయంబేడు బస్‌ టెర్మినల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పొరుగు జిల్లాలకు నడుపుతున్న ప్రభుత్వ బస్సులు బయల్దేరేందుకు రాష్ట్రప్రభుత్వం 5 ప్రాంతాలు ఎంపిక చేసింది. ఆ విధంగా పూందమల్లి బైపాస్‌ రోడ్డులో ఉన్న మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్‌స్టేషన్‌, మాధవరం, తాంబరం శానిటోరియం, తాంబరం రైల్వేస్టేషన్‌ ప్రాంగణం, కేకేనగర్‌, కిలాంబాక్కంల నుంచి గురువారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రప్రభుత్వ రవాణా సంస్థలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఈ తాత్కాలిక బస్‌స్టేషన్లకు ప్రయాణికులను తరలించేందుకు కోయంబేడు బస్‌ టెర్మినల్‌ నుంచి సిటీ బస్సులు నడుపుతున్నారు.

nani4.2.jpg

రిజర్వుడు టిక్కెట్లు...

దక్షిణ జిల్లాలకు వెళ్లేందుకు ప్రభుత్వ రవాణా సంస్థల ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణించేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు కోయంబేడు నుంచి బయల్దేరుతున్నారు. గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు ప్రతిరోజు నడుపుడుతున్న 2,100 బస్సులతో పాటు 634 ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. 2,734 బస్సుల్లో 1,36,700 మంది ప్రయాణించారు. టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకోని ప్రయాణికులు కష్టపడకుండా సులువుగా స్వస్థలాలకు వెళ్లేలా రవాణా శాఖ వసతులు సమకూర్చింది. ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం వరకు ప్రభుత్వ రవాణా సంస్థల్లో బస్సుల్లో ప్రయాణిందుకు 2,23,613 మంది టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకున్నారు.

మూడింతలు పెరిగిన విమాన చార్జీలు...

దీపావళి సెలవులు పురస్కరించుకొని విమానాల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. త్రిశూలంలోని విమానాశ్రయం నుంచి రోజుకు 35 వేల నుంచి 40 వేల మంది ప్రయాణికులు పయనమవుతుంటారు. అయితే దీపావళి సందర్భంగా ఈ సంఖ్య ఒక్కసారిగా 50 వేలకు పెరగడంతో విమానా చార్జీలు కూడా మూడు రెట్లు పెరిగాయి. చెన్నై - ఢిల్లీ మధ్య బుధవారం వరకు రూ.6,500గా ఉన్న టిక్కెట్టు ధర ప్రస్తుతం రూ.14 వేల నుంచి రూ.15 వేలకు చేరుకుంది. రూ.7.500గా ఉన్న చెన్నై- కోల్‌కొత్త విమాన చార్జీలు రూ.20 వేల నుంచి రూ.22 వేలకు పెంచారు. కాగా, చెన్నై - భువనేశ్వర్‌(Chennai - Bhubaneswar)కు రూ.6 వేలు ఉన్న టిక్కెట్టు ధర రూ.16 వేలకు పెరిగింది. చెన్నై - బెంగళూరు మధ్య రూ.3,500లు ఉన్న టిక్కెట్టు ఏకంగా రూ.6 వేలకు పెంచారు. ఇదే రీతిలో మదురై, సేలం, తిరుచ్చి, కోయంబత్తూర్‌, తూత్తుకుడి తదితర ప్రాంతాల నుంచి నడిపే విమాన చార్జీలు కూడా దీపావళి పుణ్యమా అంటూ విమాన సంస్థలు మూడు రెట్లు పెంచాయి.

ఆమ్నీ బస్సులు...

గురువారం ఒక్కరోజే ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు నడుపుతున్న ఆమ్నీ బస్సుల్లో 52,800 మంది ప్రయాణించినట్లు ఆమ్నీ బస్సుల యజమానుల సంఘం తెలిపింది. రాష్ట్రప్రభుత్వ సూచనల మేరకు పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా 1,320 బస్సులు నడుపుతున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు అన్బళగన్‌ తెలిపారు. అదే విధంగా శుక్రవారం 1,670 బస్సులు, శనివారం 1,270 బస్సులు బయలు దేరుతాయి. బస్సులు బయల్దేరే వేళలు, ప్రాంతాల గురించి తెలుసుకొనేందుకు వీలుగా 20 సమాచార కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా, లౌడ్‌ స్పీకర్ల ద్వారా నగరంలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు సమాచారం తెలియజేస్తున్నారు.

Updated Date - 2023-11-11T10:23:54+05:30 IST