Share News

Digvijaya singh: చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2023-12-05T15:31:14+05:30 IST

భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మరోసారి ప్రశ్నించారు. చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయవచ్చని అన్నారు.

Digvijaya singh: చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయొచ్చు: దిగ్విజయ్ సింగ్

భోపాల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs) విశ్వసనీయతపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ (Digvijaya Singh) మరోసారి ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన రెండ్రోజుల అనంతరం ఈవీఎంల అంశాన్ని ఆయన భోపాల్‌లో జరిగిన మీడియా సమవేశంలో లేవనెత్తారు.


''చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయవచ్చు. 2003 నుంచి ఈవీంఎల ద్వారా ఓటింగ్‌ను నేను వ్యతిరేకిస్తున్నాను. మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్ల చేతిలో పెట్టేందుకు మనం సమ్మతించాలా? ఇదొక ప్రాథమిక ప్రశ్న. అన్ని రాజకీయ పార్టీలు దీనిని పరిష్కారం కనుగొనాలి. మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈసీఐ, సుప్రీంకోర్టును కోరుతున్నాను'' అని దిగ్విజయ సింగ్ అన్నారు.

మాజీ ఎమ్మెల్యేలకు సొంత గ్రామంలో 50 ఓట్లు కూడా రాలేదు: కమల్‌నాథ్

కాగా, తమ సొంత గ్రామంలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు కాంగ్రెస్ మరో సీనియర్ నేత కమల్‌నాథ్ చెప్పారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడానికి కారణాలపై గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులతో చర్చించనున్నట్టు చెప్పారు.


ఈవీఎంలను తప్పుపట్టడం పరిపాటయింది: బీజేపీ

ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్యాలను మధ్యప్రదేశ్ బీజేపీ కార్యదర్శి రజనీష్ అగర్వాల్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలే ఆ పార్టీ ఓటమికి కారణమని అన్నారు. భారత్ జోడో యాత్ర విఫలం కావడం, కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల వల్లే కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వాళ్లు బయటకు చెప్పుకోలేకనే ఈవీఎంలపైకి తప్పునెట్టేస్తున్నారని అన్నారు. వైఫల్యాలకు కారణాలను ఆ పార్టీ ఎప్పుడూ విశ్లేషించుకోదని విమర్శించారు.


నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు 163 స్థానాలు గెలుచుకుని భారీ అధిక్యత చాటుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకు పరిమితమైంది. రాజస్థాన్‌లోనూ మెజారిటీకి మించిన సీట్లతో బీజేపీ సత్తాచాటుకుని అధికార కాంగ్రెస్‌‌ను గద్దెదింపింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ బీజేపీ అధికారం దక్కించుకుంది.

Updated Date - 2023-12-05T15:42:04+05:30 IST