Delhi mayor poll: ఢిల్లీ మేయర్ ఎన్నికలు... ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్...

ABN , First Publish Date - 2023-01-05T17:56:44+05:30 IST

ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు

Delhi mayor poll: ఢిల్లీ మేయర్ ఎన్నికలు... ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్...
Delhi LG VK Saxena

న్యూఢిల్లీ : ఢిల్లీ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు జనవరి 6న జరిగే కౌన్సిల్ మొదటి సమావేశం రణరంగాన్ని తలపించవచ్చు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గురువారం తీసుకున్న నిర్ణయం ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ప్రజాస్వామిక సంప్రదాయాలను, వ్యవస్థలను ధ్వంసం చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఆప్ విమర్శించింది.

శుక్రవారం జరిగే కౌన్సిల్ మొదటి సమావేశానికి ప్రోటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా గురువారం నియమించారు. డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు ఈ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, ఉప మేయర్ ఎన్నికలు జరుగుతాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bhardwaj) స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ప్రోటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సభలోని సీనియర్ మోస్ట్ మెంబర్‌ను నియమించడం సంప్రదాయం. కానీ అన్ని ప్రజాస్వామిక సంప్రదాయాలు, వ్యవస్థలను ధ్వంసం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది’’ అని మండిపడ్డారు.

226వ వార్డు కౌన్సిలర్ సత్య శర్మ చేత న్యూఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ సంతోష్ కుమార్ రాయ్ ప్రమాణం చేయిస్తారని గురువారం విడుదలైన నోటిఫికేషన్ పేర్కొంది. మేయర్ ఎన్నికల కోసం జరిగే సమావేశానికి అధ్యక్షత వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిగా సత్య శర్మను నియమించినట్లు తెలిపింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మేయర్ ఎన్నిక జరుగుతుందని పేర్కొంది.

ఇదిలావుండగా, మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్, బీజేపీకి చెందిన రేఖ గుప్తా నామినేషన్లను దాఖలు చేసినట్లు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. షెల్లీ ఒబెరాయ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన అభ్యర్థి అని తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆలే మహమ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్, బీజేపీకి చెందిన కమల్ బగ్రి నామినేషన్లు దాఖలు చేశారు.

మేయర్ ఎన్నిక పూర్తయిన తర్వాత, ఉప మేయర్ ఎన్నిక జరుగుతుంది. దీనిని మేయర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. మేయర్ పదవీ కాలం ఒక సంవత్సరం మాత్రమే. చట్ట ప్రకారం ఈ పదవిని మొదటి ఏడాది మహిళకు కేటాయించారు. రెండో ఏడాదిలో ఓపెన్ కేటగిరీకి చెందినవారు మేయర్ కావచ్చు. మూడో ఏడాదిలో రిజర్వుడు కేటగిరీకి చెందినవారు, మిగిలిన రెండేళ్లు ఓపెన్ కేటగిరీకి చెందినవారు మేయర్లుగా ఎన్నిక కావచ్చు.

2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి 134 వార్డులు, బీజేపీకి 104 వార్డులు, కాంగ్రెస్‌కు 9 వార్డులు లభించాయి.

Updated Date - 2023-01-05T17:56:52+05:30 IST