Akhilesh Yadav: యోగి ఇలాకాలో కాలంచెల్లిన మందులతో మృత్యుఘోష..!
ABN , First Publish Date - 2023-07-30T17:14:22+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులతో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మందులు, ఇంజెక్షన్లు తీసుకునేందుకు ముందు వాటిని పరీక్షించాలని ప్రజలను ఆయన హెచ్చరించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) లోని ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందుల (Expired medicines)తో మరణాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మందులు, ఇంజెక్షన్లు తీసుకునేందుకు ముందు వాటిని పరీక్షించాలని ప్రజలకు ఆయన సూచించారు. బ్రేక్ డౌన్ అయిన ఒక అంబులెన్స్ను కొందరు ప్రజలు తోసుకుంటూ వెళ్తున్న వీడియోను కూడా ఆయన తన ట్వీట్కు జత చేశారు.
జర జాగ్రత్త...
''హెచ్చరిక!!! ఉత్తరప్రదేశ్ ఆసుపత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు, గ్లౌజులు తీసుకునేటప్పుడు పేషెంట్లు, వారి బంధువులు అప్రమత్తంగా ఉండండి. అవి పనికి వచ్చేవో, కాలం చెల్లినవో చెక్ చేసుకోండి. కాలం చెల్లిన మందుల వాడకంతో మృతుల సంఖ్య రాష్ట్రంలో రోజురోజుగా పెరుగుతోంది'' అని అఖిలేష్ తన ట్వీట్లో ప్రజలను అప్రమత్తం చేశారు. మరో ట్వీట్లో బ్రేక్డౌన్ అయిన అంబులెన్స్ను కొందరు తోసుకువెళ్తున్న వీడియోను చూపిస్తూ, ఏమాత్రం ఆశావహంగా లేని బీజేపీ ప్రభుత్వంలో అంబులెన్స్కే అంబులెన్స్ అవసరమైందని వ్యంగ్యోక్తులు గుప్పించారు.