Supreme court: ఐదుగురు కొత్త జడ్జీలతో సీజేఐ ప్రమాణం, 32కు చేరిన సంఖ్యాబలం

ABN , First Publish Date - 2023-02-06T15:15:33+05:30 IST

సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారంనాడు..

Supreme court: ఐదుగురు కొత్త జడ్జీలతో సీజేఐ ప్రమాణం, 32కు చేరిన సంఖ్యాబలం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఐదుగురు న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachudu) సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తులు పంకజ్ మిథల్, సంజయ్ కరొల్, పీవీ సంజయ్ కుమార్, ఎ.అమానుల్లా, మనోజ్ మిశ్రాలు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 32కు చేరుకుంది.

హైకోర్టు జడ్జిల నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించేందుకు ఐదుగురు పేర్లను 2022 డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య పొరపొచ్చాలు రావడంతో ఈ నియామకాల విషయంలో జాప్యం చోటుచేసుకుంది. కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 4న ఐదుగురు కొత్త జడ్జీల నియమాకాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జస్టిస్ పంకజ్ మిథల్ రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉంటూ పదోన్నతి పొందగా, జస్టిస్ కరోల్ పాట్నా హైకోర్టు నుంచి, జస్టిస్ కుమార్ మణిపూర్ హైకోర్టు నుంచి, జస్టిస్ అమానుల్లా పాట్నా హైకోర్టు నుంచి, జస్టిస్ మిశ్రా అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.

అత్యున్నత న్యాయవ్యవస్థలో (సుప్రీంకోర్టు) కొలీజియం తరహా నియామకాలపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య ఇటీవల బహిరంగంగానే అభిప్రాయ భేదాలు తలెత్తాయి. కొలీజియం స్థానే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం జరపాలని కేంద్రం కిరణ్ రిజిజు వాదనగా ఉంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్ సైతం ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాము ప్రతిపాదించిన ఐదుగురు జడ్జిల నియామకం ఏమైందని అత్యున్నత న్యాయస్థానం గత వారంలో గట్టిగా కేంద్రాన్ని నిలదీసింది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే నియామకాల ప్రకటన ఉంటుందని అటర్నీ జనరల్ కోర్టుకు విన్నవించారు. అందుకు అనుగుణంగానే కొలీజియం సిఫారసులను కేంద్రం శనివారంనాడు ఆమోదించింది.

కాగా, జనవరి 31వ తేదీన మరో ఇద్దరు జడ్జీల పేర్లను కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ పేర్లను ప్రతిపాదించింది. కేంద్రం ఈ రెండు పేర్లను ఆమోదించి, ప్రమాణ స్వీకారం జరిగితే సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 (పూర్తి స్థాయి)కు చేరుతుంది.

Updated Date - 2023-02-06T15:15:34+05:30 IST