Share News

Chief Minister: కరువు కాటేసినా.. కేంద్రం కనికరించలేదు

ABN , First Publish Date - 2023-11-01T13:04:40+05:30 IST

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భీకర కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేంద్రం కనికరించడం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య

Chief Minister: కరువు కాటేసినా.. కేంద్రం కనికరించలేదు

- అన్నదాతలకు అన్యాయం జరగనివ్వను

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భీకర కరువు పరిస్థితి నెలకొని ఉన్నా కేంద్రం కనికరించడం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆవేదన వ్యక్తం చేశారు. కావేరి జలాల నిర్వహణ ప్రాధికార ఆదేశాల మేరకు తమిళనాడుకు నీటి విడుదలను నిరసిస్తూ మండ్య జిల్లా రైత హిత రక్షణ సమితి సారథ్యంలో రైతు సంఘాల సమాఖ్య 56 రోజులుగా చేస్తున్న సత్యాగ్రహ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం సందర్శించారు. రైతుల న్యాయ సమ్మతమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర జలవనరులశాఖ రాష్ట్ర రైతాంగం సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈసారి నైరుతి రుతుపవనాల జాడ లేకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, కావేరి బేసిన్‌లో రిజర్వాయర్లలోని నీటి ప్రమాణం రోజురోజుకు అడుగంటి పోతోందన్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో అన్నదాతలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. కావేరి జలాలల్లో వాటా కింద తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలనే ఆదేశాలు ఉన్నాయని, ప్రతి నెలా ప్రాధికార తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తోందన్నారు.

pandu3.jpg

తగిన ప్రమాణంలో వర్షాలు కురిసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదన్నారు. తొలుత రోజుకు 5వేల క్యూసెక్కులు, ఆపై 3వేల క్యూసెక్కులు, తాజాగా 2,600 క్యూసెక్కుల కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలనే ప్రాధికార ఆదేశాలను అనివార్య పరిస్థితుల్లో అమలు చేయాల్సి వస్తోందని సీఎం వివరించారు. తాగునీరు అవసరాలు తీర్చడంతోపాటు ఖరీఫ్‌ పంటను రక్షించుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతుల కష్టాలు, కడగండ్లు తనకు బాగా తెలుసునని, రైతు పోరాటాల్లో తాను ఎన్నోసార్లు పాలుపంచుకున్నానని సీఎం అన్నారు. అధికారం కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టబోమన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అధికారం కంటే రైతు సంక్షేమమే తమకు ప్రధానమన్నారు. కరువు పరిస్థితి కారణంగా పంట నష్టాన్ని చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. చెరకు రైతుల సంక్షేమం కోసం ‘మై షుగర్‌’ చక్కెర ఫ్యాక్టరీకి రూ.50కోట్లు విడుదల చేశామని తెలిపారు. రైతన్నలకు ప్రభుత్వం కొండంత అంగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి సంశయం అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. 56 రోజులుగా చేస్తున్న సత్యాగ్రహాన్ని విరమించుకోవాలని సూచించారు. సీఎం వెంట వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అంతకుముందు ధర్నాలో పాల్గొన్న రైతుల ఆరోగ్య పరిస్థితిని పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-11-01T13:04:40+05:30 IST