Share News

Chief Minister: వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్...

ABN , First Publish Date - 2023-11-07T12:40:16+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను

Chief Minister: వ్యవసాయానికి 7 గంటల నిరంతర విద్యుత్...

- అధికారులకు సీఎం సిద్దరామయ్య ఆదేశం

- విద్యుత్‌శాఖపై సమీక్ష

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ఆదేశించారు. బెంగళూరులోని తన అధికార నివాసం కృష్ణలో సోమవారం ఇంధనశాఖ ప్రగతిని సమీక్షించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ కొరత కారణంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ను 5 గంటలపాటు అందించాలని తొలుత ఉత్తర్వులు జారీ చేశామని అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులకు ఇబ్బంది ఏర్పడరాదన్న ఉద్దేశ్యంతో తాజాగా 7గంటలపాటు నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రత్యేకించి రాయచూరు, కొప్పళ, బళ్లారి, యాదగిరి జిల్లాల్లో వరి పంటను ఎక్కువగా పండిస్తున్నారని, ఇక్కడి వ్యవసాయ పంపుసెట్లకు 5 గంటల విద్యుత్‌ ఏమాత్రం సరిపోవడం లేదన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు 7 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం కొంతమేరకు కొనుగోళ్లపై ఆధారపడాల్సి ఉందని, ఇందుకు ఖాజానాపై రూ.1500 కోట్ల వరకు భారం పడవచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. అలాగే చెరుకును అధికంగా పండించే ప్రాంతాల్లోనూ 7 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

విద్యుత్‌ ఉత్పాదన పెరిగింది

రాయచూరు, బళ్లారి(Raichur, Bellary) జిల్లాల్లో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటి ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోందని సీఎం సిద్దరామయ్య అన్నారు. వీటి ఉత్పాదనను గరిష్ఠంగా 3,200 మెగావాట్లకు పెంచే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని సీఎం వివరించారు. చెరకు క్రషింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో కో-జనరేషన్‌ ద్వారా 450 మెగావాట్ల వరకు విద్యుత్‌ ఉత్పాదన జరుగుతోందన్నారు. ఒక్క కూడ్లిగిలోనే 150 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరిగిందని, విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు ఇది బాగా ఉపయోగపడిందన్నారు. పరిశ్రమలు, గృహ వినియోగ అవసరాలకు విద్యుత్‌ కోత ఎక్కడా లేదని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.13,100 కోట్లు కేటాయించామన్నారు. భాగ్యజ్యోతి, కుటీరజ్యోతి పథకాలకు 18 యూనిట్ల పరిమితే ఉన్నా చాలాచోట్ల 40 యూనిట్ల వరకు వినియోగించారని, అయినా ఇందుకైన ఖర్చును సదరు ఎస్కామ్‌లకు సంబంధించి రూ.389.66 కోట్లను ప్రభుత్వం చెల్లించిదన్నారు. ఇందులో అమృతజ్యోతి పథకం లబ్ధిదారులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు నవంబరు 1 నుంచి ఉచిత విద్యుత్‌, ఉచిత నీటి సరఫరాకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రాష్ట్రంలో 70 శాతం విద్యుత్‌ ఉత్పాదన కోసం థర్మల్‌ రంగంపైనే ఆధారపడ్డామని, ప్రస్తుతం వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఇచ్చిపుచ్చుకునే రీతిలో కొనుగోలు చేస్తున్నామన్నారు.

గణనీయంగా పెరిగిన విద్యుత్‌ వాడకం

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది విద్యుత్‌ వాడకం 43 శాతం పెరిగిందని సీఎం సిద్దరామయ్య వివరించారు. అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో 15,978 మెగావాట్ల విద్యుత్‌ వాడకం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలోనూ విద్యుత్‌ వాడకం 55 నుంచి 119 శాతానికి పెరిగిందన్నారు. ఇతర విభాగాల్లో ఇది 14 శాతం వరకు పెరిగిందన్నారు. కొవిడ్‌ అనంతరం ఆర్థిక పరిస్థితి క్రమేపీ పుంజుకోవడమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కొరత కారణంగా ఇతర రాష్ట్రాలకు సరఫరాను నిలిపివేశామని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్‌, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వందితాశర్మతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-07T12:40:17+05:30 IST