Adani row: అదానీ వివాదంపై విచారణకు కమిటీ.. ఎట్టకేలకు కేంద్రం అంగీకారం

ABN , First Publish Date - 2023-02-13T20:45:30+05:30 IST

అదానీ గ్రూపుపై (Adani Group) ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థల పరిశీలనకు సుప్రీంకోర్ట్ ప్రతిపాదిత కమిటీ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.

Adani row: అదానీ వివాదంపై విచారణకు కమిటీ.. ఎట్టకేలకు కేంద్రం అంగీకారం

ఢిల్లీ: అదానీ గ్రూపుపై (Adani Group) ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ వ్యవస్థల పరిశీలనకుగానూ సుప్రీంకోర్ట్ (Supreme Court) ప్రతిపాదిత కమిటీ ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్ర ప్రభుత్వం (Central Govt) తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తన అంగీకారం తెలిపింది. అయితే అదానీ గ్రూప్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని, అందుకే కమిటీ పరిధి, విచారణాంశాలను సీల్డ్ కవర్లోనే కోర్టుకు అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈ వివరాలను బుధవారం అందజేస్తామన్నారు. హిండెన్బర్గ్ అంశంపై విచారణ జరిపే శక్తిసామర్థ్యాలు సెబీకి ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. కాగా అదానీ గ్రూపు వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్ట్ సోమవారం విచారణ జరిగింది. ఏర్పాటు చేయబోయే కమిటీ పరిధి, విచారణాంశాలు అందిన తరువాత తీర్పు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు ఇవే..

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ (Adani Group) యాజమాన్యంలోని అదానీ గ్రూప్‌పై (Adani Group) అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) ఇటివల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రూపు కంపెనీలు నిస్సుగ్గుగా కొన్నేళ్లుగా స్టాకుల తారుమారు (Stock manipulation), అకౌంటింగ్ మోసాలకు (Accounting fraud) పాల్పడుతున్నాయని పేర్కొంది. సుమారు 218 బిలియన్ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూపు (Adani Group) దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుచుకుంటున్నట్టు తమ రెండేళ్ల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిందని రిపోర్ట్ తెలిపింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం... ‘ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద ప్రస్తుతం దాదాపు 120 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్ల వ్యవధిలోనే వృద్ధి చెందింది. గ్రూపునకు చెందిన 7 కీలకమైన కంపెనీల స్టాకుల విలువ భారీగా ఎగబాకడమే ఇందుకు కారణమైంది. మూడేళ్లకాలంలో సగటున 819 శాతం మేర షేర్ల విలువ పెరిగింది. పన్ను స్వర్గధామ దేశాలైన కరేబియన్, మారిషస్ నుంచి యూఏఈ వరకు పలు దేశాల్లో అదానీ కుటుంబం నియంత్రణలో ఉన్న పలు డమ్మీ కంపెనీలను గుర్తించాం. గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి డబ్బు మళ్లించే సమయంలో అవినీతి, మనీల్యాండరింగ్, ట్యాక్స్‌పేయర్ థెఫ్ట్ (taxpayer theft) కోసం ఈ కంపెనీలను వాడుకుంటున్నారు. అదానీ గ్రూపునకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సహా డజన్ల మందితో దీనిపై మాట్లాడాం. వేలాది డాక్యుమెంట్లను పరిశీలించాం. దాదాపు అరడజను దేశాల్లో నిశితంగా పర్యవేక్షణ చేశాం. డమ్మీ కంపెనీల్లో కొన్నింటి నిజస్వరూపం బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ మా రిపోర్టుపై నమ్మకం లేకపోతే అదానీ గ్రూపు ఫైనాన్సియల్ డేటాను పరిశీలించవచ్చు’ అని హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-13T20:53:28+05:30 IST