Budget 2023: మహిళల కోసం ప్రత్యేక పథకం

ABN , First Publish Date - 2023-02-01T12:44:37+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు.

Budget 2023: మహిళల కోసం ప్రత్యేక పథకం
Nirmala Sitharaman

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంటుకు సమర్పించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Bachat Patra) పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అవసరమైనపుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు.

మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.15 లక్షల వరకు గరిష్ఠంగా పొదుపు చేసుకునే అవకాశం ఉందని, దీనిని రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ పథకాన్ని ప్రకటించారు. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తులవారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీరు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జనబాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు నిర్మల తెలిపారు.

కృత్రిమ మేధాశక్తిని దేశం కోసం ఉపయోగించుకోవడం కోసం 3 కృత్రిమ మేధాశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూల ధన వ్యయాన్ని ప్రకటించారు.

ప్రజలకు అవకాశాలను కల్పించి, వృద్ధిని ప్రోత్సహించడంపై ఈ బడ్జెట్‌లో దృష్టిపెట్టినట్లు తెలిపారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, బలోపేతం, ఉద్యోగాల సృష్టిపై దృష్టిసారించినట్లు తెలిపారు.

ఫైనాన్షియల్ సెక్టర్‌ను బలోపేతం చేయడం, టెక్నాలజీ చోదక, నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడమే తమ విజన్ అని తెలిపారు.

Updated Date - 2023-02-01T12:44:42+05:30 IST