Mayawati Loksabha elctions: పొత్తుల్లేవ్...సోలోగానే పోటీ..

ABN , First Publish Date - 2023-10-01T15:06:09+05:30 IST

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని అన్నారు.

Mayawati Loksabha elctions: పొత్తుల్లేవ్...సోలోగానే పోటీ..

లక్నో: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌ పార్టీ (BSP) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీజేపీ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని అన్నారు. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున యుక్తిగా బీజేపీ మహిళా బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చిందని చెప్పారు. పార్టీ రాష్ట్ర ఉధ్యక్షుడు ఉమా శంకర్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


కాగా, వివిధ రాష్ట్రాల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరచేందుకు మాయావతి ఆయా రాష్ట్రాల్లో వరుస సమావేశాలు జరుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ నేతలు పనిచేస్తున్నారని, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తర్వాత జార్ఖాండ్‌లో పార్టీ ఆర్గనైజేషన్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తోందని ఇటీవల ఓ ట్వీట్‌లో మాయావతి తెలిపారు. జార్ఖండ్‌లోని 14 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశామని తెలిపారు. గిరిజనుల ఆధిపత్యం ఉన్న జార్ఖాండ్‌లో నిజాయితీ కలిగిన ప్రజలను ఎన్నికల్లో దింపుతున్నామని, అంబేద్కర్ వ్యతిరేకులు, అంబేద్కర్ వ్యతిరేక పార్టీల కారణంగా గిరిజన ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని అన్నారు. ఎన్డీయే కూటమిలో కానీ, 'ఇండియా' కూటమిలో కానీ చేరే ప్రసక్తే లేదన్నారు. ఈ రెండు కూటములు పేదల వ్యతిరేకులని, కుల, మమతత్వ, పెట్టుబడిదారీ అనుకూల పార్టీలని విమర్శించారు. తాము ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతామని, మీడియా సైతం ఎలాంటి ఊహాగానాలు కానీ, తప్పుడు ప్రచారం కానీ చేయవద్దని కోరారు.

Updated Date - 2023-10-01T15:06:09+05:30 IST