Mayawati: ఎన్డీయే లేదు, ఇండియా లేదు.. సోలోగానే..!

ABN , First Publish Date - 2023-08-30T15:10:30+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కానీ తమ పార్టీ ఎలాంటి కూటమిలోను చేరదని, ఒంటిరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

Mayawati: ఎన్డీయే లేదు, ఇండియా లేదు.. సోలోగానే..!

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కానీ తమ పార్టీ ఎలాంటి కూటమిలోను చేరదని, ఒంటిరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి (Mayawati) తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.


''ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడమనే ప్రసక్తే లేదు. ఎన్డీయే కానీ, కొత్తగా ఏర్పడిన ఇండియా (I.N.D.I.A.) కూటమిలోని పార్టీలు కానీ పేదప్రజలకు వ్యతిరేకం. కులతత్వం, మతతత్వం, క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలుతో ఉన్నవే. వీటికి వ్యతిరేకంగా బీఎస్‌పీ అనునిత్యం పోరాటం చేస్తోంది. ఆ కారణంగానే ఏ కూటమితోనూ కలిసి పనిచేసే ప్రసక్తి ఉండదు. మీడియా సైతం ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరుకుంటున్నాను'' అని మాయావతి అన్నారు.


బీఎస్‌పీ 2007లో చేసినట్టుగానే రాబోయే లోక్‌సభ ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, సమాజంలో అణగారిని, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలను ఏకీకృతం చేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పారు. గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని పటిష్టం చేయాల్సిందిగా కార్యకర్తలను కోరామని చెప్పారు.


బీఎస్‌పీ గతంలో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలతో జతకట్టి పోటీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి యూపీ నుంచి 10 మంది లోక్‌సభ ఎంపీలు, యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - 2023-08-30T15:10:30+05:30 IST