Delhi Assembly: సీఎం అధికార నివాసం ఖర్చుపై అసెంబ్లీలో గలభా...మార్షల్స్తో బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు..
ABN , Publish Date - Dec 18 , 2023 | 06:22 PM
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణలో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ బీజేపీ P) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సోమవారంనాడు గలభా సృష్టించారు. ఈ అంశంపై కాలింగ్ ఎటన్షెన్ మోషన్ ఇచ్చామంటూ చర్చకు పట్టుపట్టారు. ఇందుకు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అనుమతి నిరాకరించారు. బీజేపీ సభ్యులను బయటకు తీసుకువెళ్లాలంటూ మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అధికార నివాసం పునరుద్ధరణలో భారీ అవినీతి చోటుచేసుకుందంటూ బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సోమవారంనాడు గలభా సృష్టించారు. ఈ అంశంపై కాలింగ్ ఎటన్షెన్ మోషన్ ఇచ్చామంటూ చర్చకు పట్టుపట్టారు. ఇందుకు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అనుమతి నిరాకరించారు. దీంతో సభలో తలెత్తిన గందరగోళ పరిస్థితుల మధ్య పలువురు బీజేపీ సభ్యులను బయటకు తీసుకువెళ్లాలంటూ మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. 'గలీ గలీ మే షోర్ హై, అరవింద్ కేజ్రీవాల్ చోర్ హై' అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సభ నుంచి బయటకు పంపించిన వారిలో అసెంబ్లీలో బీజేపీ విపక్ష నేత రామ్వీర్ సింగ్ బిధూరి, అభయ్ వర్మ, అజయ్ మహావర్, మోహన్ సింగ్ బిస్త్, అనిల్ కుమార్ బాజ్పేయి, విజేందర్ గుప్త, ఓం ప్రకాష్ శర్మ, జితేందర్ మహాజన్ ఉన్నారు.
రూ.189 కోట్ల ఖర్చు..
అసెంబ్లీ వెలుపల మీడియాతో బిధూరి మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ తన రాజ్మహల్ కోసం రూ.189 కోట్లు ఖర్చు చేశారని, అన్ని నియమ నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు. ప్లాన్ అప్రూవ్ చేయించుకోవడం కానీ, టెండర్లను పిలవడం కానీ జరగలేదని, సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా చెట్లు కూడా కొట్టించేరని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన అవినీతిపై జవాబు చెప్పేందుకు ఆప్ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. చర్చ నుంచి ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. అంతా సజావుగానే జరిగితే అసెంబ్లీలో చర్చను ఎందుకు జరపడం లేదని నిలదీశారు. తాము కాలింగ్ ఎటన్షన్ మోషన్ ఇచ్చినప్పటికీ స్పీకర్ తిరస్కరించారని చెప్పారు.