Sanjay Raut: ఆ రెండు రాష్ట్రాల్లో అల్లర్ల వెనుక ఉన్నదెవరంటే..? సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2023-04-04T14:39:41+05:30 IST

బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండ వెనుక బీజేపీ కుట్ర ఉందని శివసేన నేత సంజయ్ రౌత్..

Sanjay Raut: ఆ రెండు రాష్ట్రాల్లో అల్లర్ల వెనుక ఉన్నదెవరంటే..? సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ

న్యూఢిల్లీ: బీహార్, పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అల్లర్లు, హింసాకాండ వెనుక బీజేపీ కుట్ర ఉందని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆరోపించారు. బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే అల్లర్లు చెలరేగాయని చెప్పారు. బీహార్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఆదివారం చేసిన వ్యాఖ్యలపైనా రౌత్ మండిపడ్డారు.

''తాజా అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఉంది. 2024 ఎన్నికల్లో ఎక్కడతై బీజేపీ ఓటమి చవిచూసి, ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆయా ప్రాంతాల్లోనే అల్లర్లు చెలరేగాయి. అల్లర్లకు పాల్పడిన వారిని తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోం మంత్రి చెతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలోకి ఉన్నప్పుడు అంతవరకూ ఆగడం ఎందుకు?'' అని అమిత్‌షాను రౌత్ నిలదీశారు.

హనుమాన్ జయంతికి అల్లర్లు జరగవచ్చేమో..?: మమత

శ్రీరామ నవమి శోభాయాత్రలు ముగిసి దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగనుండటంతో మరో విడత అల్లర్లు జరగవచ్చనే భయాలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు వ్యక్తం చేశారు. పండుగ ముగిసిన ఐదు రోజుల తర్వాత కూడా మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరేగింపులు తీశారని, ఆయుధాలు, బాంబులను ఊరేగింపుల్లోకి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. ''ఒకరోజు పండుగను ఐదు రోజులు ఎందుకు కొనసాగించారు? పండుగ రోజు ఉత్సవాలకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయుధాలతో ఊరేగింపుల్లో పాల్గొన కూడదు. పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపులు జరపరాదు. ఇందుకు భిన్నంగా ఎందుకు జరిగింది? రామనవమి అల్లర్లు, దహనకాండల వెనుక బీజేపీ హస్తం ఉంది'' అని మమతా బెనర్జీ అన్నారు. ఏప్రిల్ 6న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలలో మైనాటిరీలు వేధింపులకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సోదరులపై ఉందని అన్నారు.

Updated Date - 2023-04-04T14:39:41+05:30 IST