Share News

CM Himanta Biswa Sarma: కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబర్, ఔరంగ్‌జేబులకు వేసినట్టే.. హమాస్‌ని చూసి రాహుల్ భయపడుతున్నారు

ABN , First Publish Date - 2023-11-08T22:22:44+05:30 IST

Rahul Gandhi: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బాబర్, ఔరంగజేబులకు వేసినట్టేనని అన్నారు.

CM Himanta Biswa Sarma: కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబర్, ఔరంగ్‌జేబులకు వేసినట్టే.. హమాస్‌ని చూసి రాహుల్ భయపడుతున్నారు

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బాబర్, ఔరంగజేబులకు వేసినట్టేనని అన్నారు. అంతేకాదు.. ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్ని రాహుల్ గాంధీ ఖండించలేదని, ఎందుకంటే ‘ఇండియా హమాస్’ని చూసి ఆయన భయపడుతున్నాడని కుండబద్దలు కొట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హిమంత ఈ మేరకు విరుచుకుపడ్డారు.

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో హిమంత ప్రసింగిస్తూ.. ‘‘దిగ్విజయ్ సింగ్ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే నా రక్తం ఉడికిపోతుంది. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే.. దేశంలోని ‘బాబర్‌’లను ప్రోత్సాహించడమే అవుతుంది. కాంగ్రెస్‌కి ఓట్లు పడితే ‘ఔరంగజేబు’లకు విటమిన్లు వస్తాయి’’ అని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ పార్టీ ‘హిందువులు’గా మారిపోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే సమయంలో మహాదేవ్ యాప్ కేసును కూడా ప్రస్తావిస్తూ.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రూ.500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు ‘భూపేష్ యాప్’ తీసుకురావాలని, మహాదేవ్ యాప్ కాదని చెప్పారు.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని హిమంత ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా పోట్లాడుకుంటున్నాయన్నారు. పాలస్తీనాతో తమకు ఎలాంటి సమస్య లేదని, కానీ తీవ్రవాద సంస్థ హమాస్ పిల్లలను కాల్చి చంపిందని, 500 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా తీసుకుందని గుర్తు చేశారు. హమాస్ దాడిని ప్రధాని మోదీ ముక్తకంఠంతో ఖండించారని అన్నారు. కానీ.. రాహుల్ గాంధీ మాత్రం హమాస్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, హమాస్ దాడుల్ని ఆయన ఖండించలేదని పేర్కొన్నారు. హమాస్‌ను వ్యతిరేకిస్తే.. ఇండియా హమాస్ తనని విడిచిపెట్టదన్న భయంతో రాహుల్ మౌనంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంకా హిమంత మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని, దీంతో అక్కడ బాబర్ & ఔరంగజేబులకు ఆక్సిజన్ అందిందని ఆరోపణలు చేశారు. వారికి ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. అక్కడ కలకలం మాత్రం మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే వారి దుష్ప్రచారం వెంటనే మొదలవుతుందన్నారు. ఇదీ వారి రాజకీయమని, కాంగ్రెస్‌ ‘ఎన్నికల’ హిందుత్వను మనం తిరస్కరించాలని పిలుపునిచ్చారు. అయితే.. కాంగ్రెస్ నేతలు హిమంత వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం హిమంత లేనివన్నీ కల్పించి చెప్తున్నారని.. కర్ణాటకలో ప్రశాంత వాతావరణం ఉందని కౌంటరిస్తున్నారు.

ప్రస్తుతం బాబర్, ఔరంగేజేబుల కాలం కాదని.. ఇది ఆధునియ యుగమని కాంగ్రెస్ నేతలు హిమంత వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ప్రపంచ దేశాలు దూసుకుపోతుంటే.. హిమంత లాంటి బీజేపీ నేతలు ఇంకా హిందూ, ముస్లిములు అనుకుంటూ మతాల మధ్య తగాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో జరిగిన హమాస్ దాడుల్ని తిరస్కరించామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి.. రగిలిపోతున్న మణిపూర్ కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారు. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ అయినా.. ఈ సమస్యల్ని తీర్చలేకపోయారని, వీళ్లా తమపై విమర్శలు గుప్పించేది? అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Updated Date - 2023-11-08T22:24:42+05:30 IST