Economic Crisis: పాక్‌లో సంక్షోభం..ఆప్ఘన్‌లో సంతోషం

ABN , First Publish Date - 2023-03-10T19:54:46+05:30 IST

పాకిస్థాన్‌లోని ఆర్థిక సంక్షోభం పొరుగున ఉన్న ఆప్ఘనిస్థాన్‌కు వరంగా...

Economic Crisis: పాక్‌లో సంక్షోభం..ఆప్ఘన్‌లో సంతోషం

కాబూల్: పాకిస్థాన్‌ (Pakistan) లోని ఆర్థిక సంక్షోభం (Economic Crisis) పొరుగున ఉన్న ఆప్ఘనిస్థా్న్‌ (Afghanistan)కు వరంగా మారిందా? సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ పాలకులు ఖజానా నింపుకుంటున్నారా? అవుననే పలు కథనాలు చెబుతున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ రెవెన్యూ పరంగా చూసినప్పుడు పాకిస్థాన్‌ కంటే మెరుగ్గా ఉన్నట్టు ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్‌లోని వ్యాపార సంస్థల నుంచి ఓవైపు భారీగా పన్నులు వసూలు చేస్తున్న తాలిబన్లు, పాకిస్థాన్‌తో వాస్తవాధీన డ్యూరాండ్ లైన్ మీదుగా సరకులు తీసుకువెళ్లే ట్రక్కుల నుంచి కస్టమ్స్ డ్యూటీ భారీగా వసూలు చేస్తోంది.

మీడియా కథనాల ప్రకారం, తాలిబన్లు వసూలు చేస్తున్న రెవెన్యూలో సుమారు 60 శాతం ఆప్ఘన్, పాకిస్థాన్ మధ్య ఉన్న సరిహద్దుల వెంబడి వెళ్తున్న వాహనాల నుంచే వసూలు అవుతోంది. 2021లో కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మానవతా సంక్షోభం మరింత తీవ్రమైంది. దీంతో తాలిబన్లు భారీగా పన్నులు వడ్డించి, వసూలు చేస్తున్నారు. 2022 మొదటి తొమ్మిది నెలల్లో 136 బిలియన్ ఆప్ఘనిల (1.5 బిలియన్ డాలర్లు) రెవెన్యూను తాలిబిన్లు వసూలు చేసినట్టు గత నెలలో వరల్డ్ బ్యాంకు రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా దన్నుతో కాబూల్ పాలకులు చివరి ఏడాదిలో వసూలు చేసిన మొత్తం రెవెన్యూతో ఇది దాదాపు సమమని తెలిపింది. నిలకడైన రెవెన్యూను ఆప్ఘన్ సాధిస్తుండటం దిగ్భ్రాంతికరమని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ పేర్కొన్నట్టు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది. అయితే, ఐక్యరాజ్యసమితి (UN) మాత్రం ఆప్ఘన్‌లోని సగానికి సగం మంది జనం ఆకలితో అల్లాడుతున్నారని హెచ్చరించింది. తాలిబన్లు వసూలు చేస్తున్న పన్నుల వసూళ్లకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంది.

ఆప్ఘనిస్థాన్‌కు వచ్చే సరకుల్లో ఎక్కువగా ఆహారం, బత్తాయి, బంగాళాదుంపలు, వరల్డ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ ) పిండి వంటివి ఉంటాయి. పాకిస్థాన్‌లోకి వెళ్లే ట్రక్కుల్లో క్రోమైట్, కోల్ వంటివి ఎక్కవగా లోడ్ అవుతుంటాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిన తరుణంలోనే పాక్‌లో విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభం బారిన పడింది. ఈ పరిస్థితిని తాలిబన్లు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేశంలోని వాణిజ్య సంస్థల నుంచి వసూళ్లు చేసే పన్నులను పెంచడం, వాస్తవాధీన రేఖ వెంబడి వెళ్లే సరకుల ట్రక్కుల నుంచి భారీగా కస్టమ్స్ డ్యూటీ వసూళ్లు చేయడం ద్వారా పాక్ కంటే మెరుగైన పరిస్థితిలో తాలిబన్ పాలకుల ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

Updated Date - 2023-03-10T19:54:46+05:30 IST