Pakistan Crisis: పాక్ దివాలా తీయడానికి వాళ్లే కారణం...

ABN , First Publish Date - 2023-02-19T18:03:40+05:30 IST

పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి, దివాలా తీయడానికి ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు, రాజకీయనాయకులే కారణమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా.. ఆసిఫ్

Pakistan Crisis: పాక్ దివాలా తీయడానికి వాళ్లే కారణం...

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి, దివాలా తీయడానికి ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు, రాజకీయనాయకులే కారణమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Khwwaja Asif) ఆరోపించారు. ఇది స్వయంకృతాపరాధమని చెప్పారు. పాక్ దివాలా తీసిన విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బెయిల్ అవుట్ అనేది సంక్షోభంలో కూరుకుపోయిన పాక్‌‌కు సరైన పరిష్కారం కాదని చెప్పారు. మంత్రి తన స్వస్థలమైన సియాల్‌కోట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంచనల వ్యాఖ్యలు చేశారు.

''పాకిస్థాన్ దివాలా దిశగా వెళ్తున్న విషయం మీరు తెలుసుకోవాలి. పరిస్థితి విషమిస్తోంది. మనం దివాలా దేశంలో జీవించాల్సి ఉంది'' అని ఆయన అన్నారు. సమస్యకు పరిష్కరం కోసం ఇక్కడే (దేశంలోనే) వెతుక్కోవాలని, పాకిస్థాన్ సమస్యకు ఐఎంఎఫ్ పరిష్కారం కాదని ఆయన అన్నారు. పాకిస్థాన్ వారాంతపు ద్రవ్యోల్బణం 39 శాతానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఇంధన, ఆహారం తదితర నిత్యావసర విషయంలో తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే 9 సార్లు కోరింది. అయితే ఐఎంఎఫ్ విధించిన కఠిన షరతులతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రోజురోజుకూ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోతుండటం, నిత్యావసరాల ధరలు చుక్కలనండుతుండటం, పెద్ద ఎత్తున విదేశీ రుణభారం కారణంగా పాక్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా పయనిస్తోంది. అత్యవసర వస్తువుల జాబితా నుంచి వంటనూనెలు, గోధుమపిండి, పెట్రోల్ వంటి వాటిని తొలగించడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సబ్సిడీతో ఇచ్చే గోధుమ పిండి కోసం ప్రజలు పడిగాపులు కాయడంతో తొక్కిసలాట ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి.

Updated Date - 2023-02-19T18:03:41+05:30 IST