Britain : బ్రిటన్ కింగ్ చార్లెస్ అనూహ్య నిర్ణయం

ABN , First Publish Date - 2023-04-07T15:04:15+05:30 IST

మనుషులను బానిసలుగా విక్రయించే వ్యాపారంలో బ్రిటిష్ రాజ కుటుంబం పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలపై పరిశోధన జరిపేందుకు

Britain : బ్రిటన్ కింగ్ చార్లెస్ అనూహ్య నిర్ణయం
King Charles

లండన్ : మనుషులను బానిసలుగా విక్రయించే వ్యాపారంలో బ్రిటిష్ రాజ కుటుంబం పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలపై పరిశోధన జరిపేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు. ఆఫ్రికా నుంచి వేలాది మంది బానిసలను అమెరికాకు రవాణా చేసే కంపెనీలో కింగ్ విలియం-3కి వాటాలు ఉన్నాయని ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్రాచీన పత్రాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

1689లో అప్పటి కింగ్ విలియం-3కి రాయల్ ఆఫ్రికన్ కంపెనీ (RAC)లో 1,000 పౌండ్ల విలువైన వాటాలు ఉన్నట్లు ఇటీవల బయటపడిన ప్రాచీన పత్రాలు వెల్లడించాయి. ఈ కంపెనీ ఆఫ్రికా నుంచి వేలాది మంది మనుషులను బానిసలుగా మార్చి, అమెరికాకు విక్రయిస్తూ ఉండేదని తెలిసింది. ఇవి బానిసల వ్యాపారంలో ముఖ్యుడైన ఎడ్వర్డ్ కోల్‌స్టన్ సంతకం చేసిన పత్రాలు. దీనిపై కింగ్ చార్లెస్ తీవ్రంగా స్పందించారని బకింగ్‌హాం ప్యాలెస్ గురువారం తెలిపింది. బానిసల అమ్మకాలు, రాజ కుటుంబం మధ్య సంబంధాలపై పరిశోధన జరపడానికి ఆమోదం తెలిపారని చెప్పింది.

ట్రాన్స్‌అట్లాంటిక్ స్లేవ్ ట్రేడ్‌లో లక్షలాది మందిని బానిసలుగా మార్చి అమ్మేవారని, దీనిలో బ్రిటిషర్ల పాత్ర చాలా ఎక్కువ అని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. లక్షలాది మంది ఆఫ్రికన్లను బలవంతంగా కరీబియన్, అమెరికన్ దేశాలకు అక్రమంగా రవాణా చేసేవారని చెప్తున్నాయి. ఈ బానిసల చేత తోటలు, ఇతర పరిశ్రమల్లో పని చేయించేవారని చెప్తున్నాయి.

బానిసల వ్యాపారంతో బ్రిటిష్ రాజకుటుంబానికి ఉన్న సంబంధాలపై పరిశోధన నిరంతర ప్రక్రియగా కనిపిస్తోంది. గతాన్ని గుర్తిస్తూ, దాని పర్యవసానాలను పరిష్కరించేందుకు ఇటువంటి పరిశోధనలు అవసరమని చాలా మంది భావిస్తున్నారు. చారిత్రక తప్పిదాలకు నష్టపరిహారం చెల్లించాలని కరీబియన్ దేశాలు, ముఖ్యంగా జమైకా, బహమాస్ కోరుతున్నాయి. కరీబియన్ దేశాల్లో చాలా దేశాలకు కింగ్ చార్లెస్ అధిపతి. కింగ్ చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం గత ఏడాది మార్చిలో కరీబియన్ దేశాలకు వెళ్లినపుడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. బానిసల వ్యాపారం విషయంలో క్షమాపణ చెప్పాలని నిరసనకారులు ఆయనను డిమాండ్ చేశారు.

బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని పూర్తిగా నిషేధించే వరకు బానిసల వ్యాపారంలో బ్రిటిషర్ల పాత్ర ఉన్నట్లు అనేక నివేదికలు చెప్తున్నాయి. 17, 18 శతాబ్దాల్లో బానిసల వ్యాపారానికి, రాజవంశానికి మధ్యగల సంబంధాల గురించి పరిశీలించేందుకు కింగ్ చార్లెస్ అనుమతి ఇచ్చినట్లు బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. రాయల్ కలెక్షన్, రాయల్ ఆర్కైవ్స్‌లను పరిశీలించి, స్వతంత్రంగా పరిశోధించేందుకు రాజ కుటుంబం మద్దతిస్తుందని తెలిపింది. ఇవి చాలా సంక్లిష్టమైన అంశాలని, అందువల్ల సాధ్యమైనంత త్వరగా వాటిని వెలుగులోకి తేవడం ముఖ్యమని తెలిపింది. 2026 సెప్టెంబరునాటికి ఈ పరిశోధన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Ayodhya Ramalayam : అయోధ్య రామాలయం నిర్మాణంలో కీలక ఘట్టం

Manish Sisodia Letter: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓపెన్ లెటర్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు..

Updated Date - 2023-04-07T15:04:15+05:30 IST