India vs Canada: జీ20 సదస్సుకి ముందే కెనడా మాస్టర్ ప్లాన్.. కానీ కథలో ఊహించని ట్విస్ట్.. అసలేమైందంటే?

ABN , First Publish Date - 2023-09-20T15:10:42+05:30 IST

ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని తమ ప్రభుత్వం...

India vs Canada: జీ20 సదస్సుకి ముందే కెనడా మాస్టర్ ప్లాన్.. కానీ కథలో ఊహించని ట్విస్ట్.. అసలేమైందంటే?

ఖలిస్తాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్, కెనడా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య విభేదాలు ముదిరాయి. అయితే.. ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని వారాల ముందే కెనడా ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.


నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికాతో పాటు ఫైవ్ ఐస్ గ్రూపులోని మిత్రదేశాలను కెనడా కోరినట్లు తెలిసింది. కానీ.. ఆ దేశాలు అందుకు విముఖత వ్యక్తం చేశాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అలాగే.. బైడెన్ పరిపాలన, దాని మిత్రదేశాలు ఎదుర్కొంటున్న దౌత్యపరమైన సవాళ్లను సైతం అది హైలైట్ చేసింది. ఆ దేశాలు భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. జీ20 సదస్సు జరగడానికి కొన్ని వారాల ముందు ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపిందని.. నిజ్జర్ హత్యని బహిరంగంగా ఖండించాలని కోరిందని ఆ మీడియా కథనం వెల్లడించింది.

ఈ అలయన్స్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, యూకే, కెనడా మొదలైనవి సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే.. ఈ దేశాలు కెనడా వినతిని తిరస్కరించాయి. అందుకేనేమో.. జీ20 సదస్సులో జస్టిన్ ట్రూడో భారత్‌తో పాటు మిత్రదేశాల అధినేతలతో అంటీముట్టనట్టుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇక సమ్మిట్ ముగిసిన అనంతరం కెనడాకు తిరిగెళ్లిన వారం రోజుల తర్వాత.. నిజ్జర్ హత్యలో భారత్ హస్తముండొచ్చంటూ ఆరోపించారు. అంతేకాదు.. ఈ అంశంలో భారత్ దౌత్యాధికారిని బహిష్కరించారు. ఇందుకు కౌంటర్‌గా.. భారత్ కూడా కెనడా దౌత్యాధికారిని బహిష్కరించింది. అలాగే.. ట్రూడో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించింది.


కాగా.. 1997లో ప్లంబర్‌గా కెనడాకు వెళ్లిన నిజ్జర్, ఖలిస్తాని వేర్పాటువాదులతో గట్టి సంబంధాలనే ఏర్పరుచుకున్నాడు. 2010 పాటియాలా బాంబు పేలుళ్ల కేసుతో పాటు పలు హత్యల్లో నిజ్జర్ ప్రమేయం ఉందని తేలడంతో.. భారత్ అతడ్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతని తలపై రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. అయితే.. నిజ్జర్ జూన్ 18వ తేదీన కెనడాలోని సర్రే నగరంలో హత్యకావింపబడ్డాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే.. భారత్ ఇతడ్ని ఉగ్రవాదిగా ప్రకటిస్తే, కెనడా మాత్రం తమ దేశ పౌరుడిగా పేర్కొంది.

Updated Date - 2023-09-20T15:10:42+05:30 IST