నిరుద్యోగులపై ఇంత భారమా? ఫీజులు కట్టేదెలా?

ABN , First Publish Date - 2023-04-21T14:37:06+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆశతో అవమానాలను భరిస్తూ తల్లిదండ్రుల రెక్కల కష్టంపై ఆధారపడి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న

నిరుద్యోగులపై ఇంత భారమా? ఫీజులు కట్టేదెలా?
unemployed

అసలే నిరుద్యోగులు.. ఆపై భారీ ఫీజులు!

గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసేదెలా?..

జనరల్‌ అభ్యర్థులకు రూ.1,200.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 600

అభ్యర్థులకు భారంగా రుసుము

టీఎస్‌పీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డులకు బడ్జెట్‌

ట్రిబ్‌కు రూపాయి ఇవ్వని సర్కారు

అభ్యర్థుల నుంచే వసూలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న ఆశతో అవమానాలను భరిస్తూ తల్లిదండ్రుల రెక్కల కష్టంపై ఆధారపడి ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు గురుకుల ఉద్యోగ పరీక్ష ఫీజు భారంగా మారింది. పరీక్ష రుసుములను ప్రభుత్వం భారీగా వసూలు చేయడంపై నిరుద్యోగలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులకు వాటి పరిధిలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు బడ్జెట్‌ను కేటాయిస్తున్న సర్కారు.. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌)కు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. దీంతో ట్రిబ్‌ పరిధిలోని సొసైటీలు వాటికి కేటాయించిన బడ్జెట్‌ నుంచే పరీక్ష నిర్వహణ ఖర్చును భరించాల్సి వస్తోంది. సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనారిటీ, రెసిడెన్షియల్‌ గురుకులాలకు ప్రభుత్వం నామమాత్రపు బడ్జెట్‌ను కేటాయిస్తుండగా, మళ్లీ ఈ పరీక్ష నిర్వహణకు అందులో నుంచే కొంత వాటా ఇవ్వాల్సి రావడంతో గురుకులాల నిర్వహణకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ పరీక్ష రుసుము విషయంలో నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష రుసుము వసూళ్లలో భాగంగా ప్రస్తుతం ట్రిబ్‌ విడుదల చేసిన పోస్టుల భర్తీకి జనరల్‌ అభ్యర్థులకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.600 దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ పరీక్ష ఫీజులను రూ.200 వరకే వసూలు చేయగా, కేంద్రం నిర్వహించే పరీక్షలకూ నామమాత్రపు రుసుములే ఉన్నాయి. ట్రిబ్‌ మాత్రం భారీగా ఫీజులు వసూలు చేయడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రెండు, మూడు పోస్టులకు అర్హులు..

గురుకుల బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉన్న అన్ని ఉద్యోగాల్లో ఒక్కో అభ్యర్థి కనీసం రెండు, మూడు పోస్టులకు అర్హులయ్యే అవకాశం ఉంది. దీంతో ఒక్కో అభ్యర్ధి రెండు, మూడు కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక అభ్యర్థి నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు రుసుమే రూ.4,800 అవుతుండగా, ఇంటర్‌నెట్‌ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఒక్కో దానికి రూ.150-200 వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం మూడు పోస్టులకు కలిపి రూ.5,400 వరకు అవుతుండడంతో నిరుద్యోగులకు భారంగా మారుతోంది. ఒక్క పోస్టుకు దరఖాస్తు చేసుకోదల్చిన అభ్యర్థుల్లోనూ ఎక్కువ మందిఈ రుసుము కోసం అప్పులు చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ప్రఽధానంగా గ్రామాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని ఓయూ విద్యార్థి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

అధికంగా ఫీజుల వసూలు..

గురుకుల పోస్టులకు దాదాపు 3 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుమారు రూ.8-10 కోట్లు పరీక్ష ఫీజు రూపంలో బోర్డుకు వస్తాయని అంచనా. అయితే ఈ డబ్బులు కేవలం సాంకేతిక పరమైన ఖర్చులకే సరిపోతాయని అంటున్నారు. పరీక్ష నిర్వహణ, ఇన్విజిలేటర్లు, ఇతర ఖర్చులకు అవసరమయ్యే డబ్బును సొసైటీలే భరించనున్నాయి.

సర్కారు మెటీరియల్‌ అందించేనా..?

గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్‌పై సర్కారు ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పరీక్ష సిలబ్‌సతో కూడిన పుస్తకాలను ప్రభుత్వం అందించాలని అభ్యర్థులు కోరుతున్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఉద్యోగ అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో పరీక్షలకు సన్నద్ధమవలేకపోతున్నట్లు నిరుద్యోగులు చెబుతున్నారు.

గురుకుల పోస్టుకు దరఖాస్తు చేద్దామంటే ఫీజు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు పల్లె నుంచి హైదరాబాద్‌కు వచ్చా. ఫంక్షన్లలో కేటరింగ్‌ చేస్తూ, ఫ్లవర్‌ డెకరేషన్‌ పనులకు వెళ్తూ పరీక్షలకు సిద్ధం అవుతున్నా. కేటరింగ్‌కు వెళ్తే రూ.500 కూలీ ఇస్తారు. ఆ డబ్బుతో పరీక్ష ఫీజు కూడా కట్టలేను. ఒక్కోసారి 5 రూపాయల భోజనంతోనే కడుపు నింపుకొంటున్నా. ఎంతోమంది నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం పరీక్ష ఫీజులను తగ్గించాలి

- కరీంనగర్‌ జిల్లాకు చెందిన శశి వ్యథ

Updated Date - 2023-04-21T14:37:06+05:30 IST