TS Education: కాలేజీల్లో ఆకలి కేకలు! ఏళ్లు గడుస్తున్నా అమలుకాని సీఎం హామీ

ABN , First Publish Date - 2023-08-25T11:30:56+05:30 IST

ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో

TS Education: కాలేజీల్లో ఆకలి కేకలు! ఏళ్లు గడుస్తున్నా అమలుకాని సీఎం హామీ

ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో అందని మధ్యాహ్నం భోజనం

ఏళ్లు గడుస్తున్నా అమలవని కేసీఆర్‌ హామీ

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదువుకోవాలన్న ఆశయంతో ఉదయాన్నే ఇంటి నుంచి కళాశాలలకు వస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఆకలి మంటతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో భోజన విరామం తర్వాతి క్లాసులు వినకుండానే చాలామంది ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో చదువులో వెనకబడిపోతున్నారు.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కలగానే మిగులుతోంది. పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా.. నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, మోడల్‌ స్కూళ్లు, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు పాఠశాలల మాదిరిగా మధ్యాహ్న సమయంలో ఉచితంగా భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తద్వారా సర్కారీ విద్యాసంస్థలపై భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీఎ్‌సడబ్ల్యూడీసీ) అధికారులను సంప్రదించి పథకం అమలుకు సంబంధించిన ఖర్చు, నిర్వహణ బాధ్యతలను ఎవరికి కట్టబెడితే బాగుంటుందనే వివరాలను తెప్పించింది. ఇందులో భాగంగా ఆయా కాలేజీల్లో రోజువారీ భోజనం తయారీ, ఇతర ఖర్చులకు ఏటా రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. అయితే ఏటా అంత మొత్తాన్ని భరించే పరిస్థితి లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని పక్కన పెట్టింది.

రెండేళ్ల క్రితం మళ్లీ తెరపైకి..

2016లో మధ్యాహ్న భోజనంపై హడావుడి చేసి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 2020 జూలైలో ఈ పథకం అమలును మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసి అందిస్తున్నారని తెలుసుకున్న సీఎం కేసీఆర్‌.. ఇంటర్మీడియట్‌తోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.80 లక్షల మందికి రోజువారీ భోజనానికి ఎంత ఖర్చవుతుందన్న వివరాలతో ప్రతిపాదనలివ్వాలని మంత్రుల కమిటీ అధికారులను కోరింది. ఇప్పటివరకు పథకం అమలు ఊసే లేదు. కాగా, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. ఫలితంగా హాజరు శాతం పడిపోతోంది.

మధ్యాహ్నం భోజనం పెట్టాలి

ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని ద్రాక్షగానే మారింది. ఇప్పటి వరకు ఒక్క కాలేజీలో కూడా అమలు చేయడం లేదు. తక్షణమే కాలేజీల్లో భోజన పథకాన్ని అమలు చేయాలి.

- జావిద్‌, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - 2023-08-25T11:30:56+05:30 IST