Hyderabad School demolition: తెల్లారేసరికి స్కూల్ మాయం! ఎండలోనే చదువు!

ABN , First Publish Date - 2023-03-24T12:05:21+05:30 IST

ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో గురువారం బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి

Hyderabad School demolition: తెల్లారేసరికి స్కూల్ మాయం! ఎండలోనే చదువు!
ఎండలోనే చదువు

విద్యార్థులు వచ్చేసరికి బడి కూల్చివేత

విద్యాశాఖకు సమాచారం లేకుండానే చర్య

ఉగాది రోజున సీతాఫల్‌ మండి భవనం కూల్చిన కాంట్రాక్టర్‌

బడిలోని రికార్డులు, సామగ్రి ధ్వంసం

రోడ్డు మీద ఎండలో కూర్చున్న విద్యార్థులు

బౌద్ధనగర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల (Goverment School), కళాశాలలు ఉన్న ఆ విద్యాలయ ప్రాంగణంలో.. పాత భవనాలను కూలగొట్టి.. కొత్త బిల్డింగులను నిర్మించాలని విద్యా శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కాలేజీలను మరో చోటుకు మార్చింది. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాల్సి ఉంది. అయితే, ఉన్నట్టుండి ఉగాది రోజున సెలవును పురస్కరించుకుని కాంట్రాక్టర్‌ రంగంలోకి దిగాడు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో గురువారం బడికి వచ్చిన టీచర్లు, విద్యార్థులు పరిస్థితిని చూసి కంగుతిన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూలు భవనాన్ని ఎలా కూలగొడతారని తల్లితండ్రులు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీతాఫల్‌మండి ప్రభుత్వ పాఠశాల భవన ఆవరణలో పాఠశాలతో పాటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలున్నాయి. బడిలో 32 తరగతి గదులుండగా, సుమారు 500 మంది చదువుకుంటున్నారు. పాత స్కూలు భవనం స్థానంలో మల్టీ మోడల్‌ బిల్డింగ్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఐదు అంతస్థులతో భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల కింద రూ.29.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్‌, డిగ్రీ కాలేజీలను మరో చోటుకు మార్చారు. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాలని చూసినా, సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సెలవు కావడంతో విద్యా శాఖాధికారులకు, టీచర్లకు సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్‌ స్కూల్‌ భవనాన్ని కూల్చేశాడు. కాగా, పద్మారావు ఆదేశాల మేరకే కాంట్రాక్టర్‌ ఇలా చేశాడని టీచర్లు ఆరోపించారు. తరగతి గదుల్లోని సామగ్రి, ల్యాబ్‌లు, బీరువాలు, రికార్డులు ధ్వంసమయ్యాయని చెప్పారు. గురువారం స్కూలుకు వచ్చిన విద్యార్థులు, టీచర్లు రోడ్డుపైనే ఎండలో కూర్చున్నారు. టాయిలెట్లను కూడ కూల్చివేయడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు.

పరీక్షల సమయంలో కూల్చివేస్తారా?

పరీక్షలు జరిగే సమయంలో స్కూలు భవనాన్ని కూల్చివేస్తారా.. మా పిల్లలు పదో తరగతి చదువుతున్నారు. ఇప్పుడు వారి భవిష్యత్‌ ఏమిటి? ఉదయం నుంచి విద్యార్థులు ఎండలో కూర్చుని చదువుకుంటున్నారు.

- పద్మావతి, మహేశ్వరి విద్యార్థుల తల్లులు

పిల్లలను స్కూలుకు పంపించం

విద్యార్థుల జీవితాలతో ప్రజాప్రతినిధులు ఆటలాడుతున్నారు. మా పిల్లలు ఆరు, ఏడో తరగతి చదువుతున్నారు. ఉదయం నుంచి ఎండలో చదువుతున్న పిల్లలను చూసి బాధపడుతున్నాం. ఇకనుంచి మా పిల్లలను స్కూలుకు పంపించం. పరీక్షల తేదీ చెబితే పరీక్షలకు పంపుతాం. టాయిలెట్లును కూల్చివేయటంతో ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు.

- కల్పన, సంధ్య విద్యార్థుల తల్లులు

త్వరగా మరో స్కూలుకు పంపండి

తమను త్వరగా మరో స్కూలుకు పంపించండి. ఉదయం స్కూలుకు వచ్చిచూసేసరికి తరగతి గదులన్నీ కూల్చివేశారు. గత్యంతరంలేక ఎండలో కూర్చున్నాం. పరీక్షల సమయంలో ఇలా చేయటం చాలా బాధగా ఉంది.

- సుశీల, తొమ్మిదో తరగతి విద్యార్ధిని

మాకు సమాచారం లేదు: డీఈవో

తమకు సమాచారం ఇవ్వకుండానే స్కూలు భవనాన్ని కూల్చివేశారని హైదరాబాద్‌ డీఈవో రోహిణి తెలిపారు. కూల్చివేసిన స్కూలు భవనాన్ని గురువారం ఆమె పరిశీలించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రోహిణి తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో స్కూలు భవనాన్ని ఎలా కూల్చివేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-24T12:05:21+05:30 IST