Smartphone: పండుగ సీజన్‌లోనూ పడిపోయిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు!

ABN , First Publish Date - 2023-01-19T19:38:21+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి.

Smartphone: పండుగ సీజన్‌లోనూ పడిపోయిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు!

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. పండుగ సీజన్ అయిన చివరి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఇలా పడిపోవడం ఇదే తొలిసారి. నిజానికి దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సమయాల్లో స్మార్ట్‌ఫోన్లపై ఈ-కామర్స్ సంస్థలు, మొబైల్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. నిజానికి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ, ఈసారి ఆశ్చర్యకరంగా కొనగోళ్లు దారుణంగా పడిపోయాయి.

గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ ‘కనాలిస్’(Canalys) ప్రకారం నాలుగో త్రైమాసికంలో తొలిసారి స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పడిపోయాయి. అంతకుముందు ఏడాది (2021)తో పోలిస్తే 6 శాతం తగ్గాయి. 2022లో మొత్తం 151.6 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. అయితే, నాలుగో త్రైమాసికంలో షిప్‌మెంట్స్ 27 శాతం క్షీణించి 32.4 మిలియన్లకు పడిపోయాయి.

నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ (Samsung) టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2017 మూడో త్రైమాసికంలో టాప్ ప్లేస్‌లో నిలిచిన శాంసంగ్ ఆ తర్వాత మళ్లీ అమ్మకాల్లో దుమ్ము రేపడం ఇదే తొలిసారి. క్వార్టర్-4లో శాంసంగ్ ఇండియాలో మొత్తం 6.7 మిలియన్ యూనిట్లు విక్రయించింది. మార్కెట్ షేర్‌లో ఇది 21శాతం కావడం గమనార్హం. 6.4 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో వివో(Vivo) రెండో స్థానంలో నిలిచింది. 20 త్రైమాసికాల తర్వాత తొలిసారి షావోమి(Xiaomi) క్వార్టర్-4లో మార్కెట్ లీడర్ షిప్ స్థానాన్ని కోల్పోయింది. 5.5 మిలియన్ యూనిట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. అయితే, ఓవరాల్‌గా మాత్రం 2022లో సావోమి మార్కెట్ లీడర్‌గా అవతరించింది. ఒప్పో, రియల్‌మి వరుసగా 5.4 మిలియన్లు, 2.7 మిలియన్లతో నాలుగైదు స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2023-01-19T19:38:23+05:30 IST