Chandrababu: స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను సభలో అడుగు పెట్టనివ్వం

ABN , First Publish Date - 2023-03-20T16:41:20+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యె డోలా వీరాంజనేయ స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLAs) సభలో అడుగు పెట్టనివ్వమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను సభలో అడుగు పెట్టనివ్వం

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై ( TDP MLA Dola Veeranjaneya Swamy) దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLAs) సభలో అడుగు పెట్టనివ్వమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 1 జారీ చేసిన ప్రభుత్వానికి సిగ్గు ఉందా?, అసెంబ్లీలో జరిగిన ఘటన ఆగ్రహం తెప్పిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. జీవో 1ను రద్దు చేయమని అడగడం తప్పా..? అని, ఆగస్టు సంక్షోభంలోనూ.. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఓ చీకటి రోజు అని, అసెంబ్లీలో దాడి ఘటనలు గతంలో జరగలేదని, స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీనే దాడి చేసిందని అరోపిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనిషి బుచ్చయ్యచౌదరి మీదకు వస్తారా..? అని, స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయామనే బాధ తనకెప్పుడూ ఉంటుందని చంద్రబాబు అన్నారు.

బాబాయ్ గొడ్డలిపోటు, కోడి కత్తి డ్రామా తరహాలోనే ఇప్పుడు సభలో వైసీపీ వ్యవహరించిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది చిన్న గాలే.. రాబోయేది సునామీ అని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతం కాదని, కానీ అసెంబ్లీ (Assembly) శాశ్వతమని చెప్పారు. విభజన సందర్భంలో మాట్లాడుకునే పరిస్థితి కూడా లేనప్పుడే ఎమ్మెల్యేలు విజ్ఞతతో వ్యవహరించారని, వైసీపీ వారు 150 మంది ఉన్నారని, 20 మంది ఉన్న తమ సభ్యులపై దాడి చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సభలో మమ్మల్ని చంపేస్తారా?.. స్పీకర్ నిస్సహాయుడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నేతల మీద దాడి.. ఆఫీసుల మీద దాడి.. ఇదేనా వైసీపీ విధానం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి పోరాటం ఊరికే పోదని, స్వామిపై విలన్ల మాదిరి వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని, స్వామిపై దాడి చేసిన వారిని సభలో అడుగు పెట్టనివ్వమని చంద్రబాబు హెచ్చరించారు. జీవో 1, ఎమ్మెల్యే స్వామిపై దాడి విషయమై టీడీపీ (TDP) కార్యాచరణను ప్రకటించింది. ఈ వ్యవహారంపై ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పర్యటనలు చేపట్టనుంది. జీవో 1, సభలో ఘటనలను ప్రజలకు వివరించాలని, జీవో 1, సభలో ఘటన అంశాలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-03-20T16:41:47+05:30 IST