Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదు: కేంద్రం

ABN , First Publish Date - 2023-03-13T16:32:15+05:30 IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదు: కేంద్రం

ఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ నిర్ణయంలో మార్పులేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (MP Kanakamedala Ravindrakumar) ప్రశ్న లేవనెత్తారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో పునరాలోచన లేదని కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ప్రైవేటీకరణ (Privatization)ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది. ఉద్యోగుల ఆందోళనల దృష్ట్యా నిర్ణయం మార్చుకుంటారా? అని కనకమేడల అడగ్గా.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించే ప్రతిపాదనేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

ప్రైవేటు దిశగా విశాఖ ఉక్కు

రేషనలైజేషన్‌ (Rationalization) పేరుతో విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రైవేటీకరణను అటు కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పరోక్ష పద్ధతులను ఎంచుకుంది. నోటితో చెప్పకుండా అన్యాపదేశ ఆదేశాలతో ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. తద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో ఏటా 200 నుంచి 300 మంది ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (Executive Trainee)లను రిక్రూట్‌ చేయడం ఆనవాయితీ. ఈ ప్రక్రియ ఆగిపోయింది. గత ఏడాది కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఇది చాలు ఏ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారో అర్థం చేసుకోవడానికి. ఒకవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు... మరోవైపు యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది. ఈ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. అయినా సరే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మూడేళ్ల క్రితం విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ (Executive Non Executive) కలిపి 17,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 14,880కి పడిపోయింది. దాదాపుగా 13 శాతం తగ్గిపోయారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌).. అంటే విశాఖ ఉక్కు కర్మాగారం. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో తెలుగువారి ఉద్యమ ఫలితంగా ఏర్పడిందీ సంస్థ. పుట్టినప్పటి నుంచీ కేంద్రం అడ్డంకులు సృష్టించినా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. నాణ్యమైన ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అలాంటి సంస్థను ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేయాలని మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిని అడ్డుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్రానికి చీమకుట్టినట్లయినా లేదు. దానిని దివాలా తీయించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం పెరిగి పరిశ్రమకు నష్టాలు అధికమవుతున్నాయి. ముడి పదార్థాలు కొనడానికి కూడా నిధుల్లేని పరిస్థితి తలెత్తితే.. ఆర్థిక సహకారం అందకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. చివరకు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది.

Updated Date - 2023-03-13T16:59:47+05:30 IST