Tirumala: తిరుమల మొదటి ఘాట్లో ఇద్దరు దుర్మరణం
ABN , First Publish Date - 2023-05-14T20:09:51+05:30 IST
తిరుమల (Tirumala) మొదటి ఘాట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా (Anantapur District)లోని రాయదుర్గానికి చెందిన...
తిరుమల: తిరుమల (Tirumala) మొదటి ఘాట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా (Anantapur District)లోని రాయదుర్గానికి చెందిన ఓ భక్తబృందం శ్రీవారి దర్శనం ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం కారులో తిరుమల నుంచి తిరుగు ప్రయాణమైంది. 24వ మలుపువద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని చూసినవారు దర్శించుకోవాలని వాహనాన్ని పక్కగా నిలిపారు. ఈక్రమంలో వాహనం నుంచి దిగిన రేణుకమ్మ(24) ఆంజనేయస్వామిని దర్శించుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన మరో కారు ఈమెను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రేణుకమ్మతోపాటు బోల్తాపడిన వాహనంలోని మెదక్కు చెందిన పార్వతి(72) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. బోల్తాపడిన వాహనంలోని 14 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒకేసారి ఇద్దరు భక్తులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను, క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. బోల్తాపడిన వాహనాన్ని పక్కకు తొలగించి, ఘాట్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.