AP News: మండిన రాష్ట్రం.. అప్రమత్తతే అండ

ABN , First Publish Date - 2023-05-12T21:53:42+05:30 IST

రాష్ట్రంలో శుక్రవారం ఎండ ఠారెత్తించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి.

AP News: మండిన రాష్ట్రం.. అప్రమత్తతే అండ

విశాఖపట్నం: రాష్ట్రంలో శుక్రవారం ఎండ ఠారెత్తించింది. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా (Prakasam District) జీగురుమిల్లి, పల్నాడు జిల్లా నార్మలపాడులో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం నుంచి కోస్తా, రాయలసీమలో (Rayalaseema) ఎండతీవ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం ఐదు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో (Guntur and Prakasam districts) ప్రభావం ఎక్కువగా వుంటుందని పేర్కొంది. కాగా ఆదివారం 144 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 161 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, వీటిలో కూడా ఎక్కువ ప్రాంతాలు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉంటాయని ప్రకటించింది.

ప్రజలు అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. కాగా బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అతి తీవ్ర తుఫాన్‌ దిశగా భూ ఉపరితలం మీదుగా గాలులు వీయడంతోనే రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శనివారం నుంచి ఐదారు రోజులు వరకు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత నెలకొంటుందని పేర్కొన్నారు. అధిక వేడి, ఉక్కపోతకు జిల్లావాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాగా రానున్న నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింతగా భయాందోళన చెందుతున్నారు.

ద్రవ పదార్థాలు తీసుకోవాలి

వేసవిలో ఉష్ణోగ్రత తీవ్రత తట్టుకునేందుకు ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఎండలో తిరగరాదు. నీడపట్టునే ఉండేందుకు ప్రయత్నించాలి. అత్యవసర వేళల్లో బయటకొస్తే.. టోపీతో పాటు కళ్లద్దాలను కూడా ధరించాలి. డీహైడ్రేషన్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-05-12T21:53:42+05:30 IST