TDP: గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాట..

ABN , First Publish Date - 2023-01-01T19:21:22+05:30 IST

గుంటూరులోని వికాస్నగర్లో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి.

TDP: గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాట..
Stampede in Nara Chandrababu Naidu public meeting in Guntur

గుంటూరు: గుంటూరు(Guntur)లోని వికాస్నగర్లో టీడీపీ(TDP) నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జనతా వస్త్రాలు, పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణం నుంచి చంద్రబాబు వెళ్లిపోయాక తొక్కిసలాట జరిగింది. కిట్ల కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.

అంతకుముందు గుంటూరు వికాస్నగర్ సభలో ప్రసంగించిన చంద్రబాబు 2022 మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచిందని చెప్పారు. పేదలకు న్యాయం చేయాలని మొదట అనుకున్నది ఎన్టీఆరేనని చంద్రబాబు చెప్పారు. 1983లో కిలో బియ్యం రూ.2కే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఇవాళ్టి ఆహార భద్రత పథకానికి స్ఫూర్తి కూడా ఎన్టీఆరేనని చంద్రబాబు చెప్పారు. పేదవాళ్లకు పక్కా ఇళ్లు ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని తెలిపారు. టీడేపీ హయాంలో సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. టీడీపీ పాలనలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చామని, పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని చెప్పారు. 54 లక్షల మందికి రూ.2 వేలు పెన్షన్ అందించామని చంద్రబాబు చెప్పారు.

ఇటీవల కందుకూరులో జరిగిన టీడీపీ రోడ్ షో‌లోనూ తొక్కిసలాట జరిగింది. నాటి ఘటనలో 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

Updated Date - 2023-01-01T20:12:56+05:30 IST