AP Minister: మగవారిని మంత్రి ధర్మాన ఇలా అన్నారేంటి!

ABN , First Publish Date - 2023-03-29T10:40:41+05:30 IST

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి నోరుజారారు.

AP Minister: మగవారిని మంత్రి ధర్మాన  ఇలా అన్నారేంటి!

శ్రీకాకుళం: రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) మరోసారి నోరుజారారు. మగవారంతా పోరంబోకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మగవారు తినేసి వెళ్లిపోతారని... వారికి బాధ్యతలు పట్టవన్నారు. జిల్లాలో నిన్న (మంగళవారం) జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో మగవారి గురించి ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మగవారంతా పోరంబోకులు. తినే సమయానికి వచ్చి తినేసి వెళ్లిపోతారు. అన్ని పనులు సమకూర్చుకునేది ఇంటి ఇల్లాలే. ఇంటిని నడిపేది ఇల్లాలే. అందుకే ప్రభుత్వం అన్ని పథకాలను ఇళ్లాలి పేరునే ఇస్తోంది’’ అని అన్నారు.

దీనితో పాటు మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో గార మండలంలోని ఓ గ్రామానికి వెళ్లినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాన్ని ధర్మాన ప్రస్తావించారు. ఓ వృద్ధురాలిని సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని వాకబు చేసే సమయంలో... అన్నీ అందుతున్నాయని ఆమె చెప్పిందన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తావు అంటే సైకిల్‌కి అని చెప్పిందని.. అలాంటి వారికి గుర్తులపై అవగాహన పెంపొందించాలని కార్యకర్తలకు మంత్రి ధర్మాన సూచించారు. అయితే మగవారిపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల కాలంలో రాజకీయంగా ధర్మాన చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలు తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి.

Updated Date - 2023-03-29T10:40:41+05:30 IST