YCP: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ABN , First Publish Date - 2023-05-25T18:26:34+05:30 IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కారు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలోని పేట అగ్రహంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు (YCP MLA MS Babu) చేపట్టారు.
చిత్తూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సర్కారు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలోని పేట అగ్రహంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు (YCP MLA MS Babu) చేపట్టారు. ఎమ్మెల్యే వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. తన అనుచరులు, అధికారులు, వాలంటీర్లతో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇళ్లకు తాళాలు వేసిన విషయాన్ని చూసి షాక్ అయ్యారు. గ్రామంలో ఉన్న వృద్ధృలతో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో తనకే ఓట్లు వేయాలని కోరారు. తాను వస్తున్న విషయాన్ని తెలుసుకొని గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లడంపై ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధిగా ప్రభుత్వ పథకాలు తిరిగి ఇచ్చేయమని కోరడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పారలని పేట అగ్రహారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ఆయన పథకాలు తిరిగి ఇచ్చేయమనడం లబ్ధి పొందుతున్న వృద్ధులు, వితంతువులు, బడుగు బలహీన వర్గాలను అవమానపరిచినట్లేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తన జేబులో నుంచి డబ్బులు ప్రజా పథకాలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న ప్రజాధనం నుంచే సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, నాలుగేళ్ల కాలంలో తమ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం కారణంగానే తాము ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బహిష్కరించామని పేట అగ్రహారం గ్రామస్తులు చెబుతున్నారు. అందుకు ఎమ్మెల్యే గ్రామ ప్రజలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, సంక్షేమ పథకాలను సిగ్గు ఉంటే తిరిగి ఇచ్చేయమనడం మంచిది కాదంటూ ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే వ్యవహార తీరుపై గ్రామంలో ప్రజలందరూ ఒక్కటై ఏ విధంగా ముందుకు పోవాలో సమాలోచనలు చేస్తున్నారు.