Yuvagalam Padayatra: లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో అడుగేసిన నారా భువనేశ్వరి

ABN , First Publish Date - 2023-05-15T21:29:10+05:30 IST

జగన్‌ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి..

Yuvagalam Padayatra: లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో అడుగేసిన నారా భువనేశ్వరి

నంద్యాల: జగన్‌ను గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి వందరోజులు పూర్తి చేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం బోయరేవుల క్యాంపు సైట్‌ నుంచి ప్రారంభమైన లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆయన తల్లి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) యువగళంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ వందో రోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వెలుగోడు మండలం మోతుకూరు గ్రామ శివారులో లోకేశ్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వంద మొక్కలను నాటారు. 100వ రోజు పాదయాత్ర బోయరేవుల క్యాంపుసైట్‌ నుంచి మోతుకూరు, దేవళాపురం, సంతజూటూరు, పరమటూరు క్రాస్‌ మీదుగా బండి ఆత్మకూరు సమీపంలోని విడిది కేంద్రం వరకు 14.1 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు మొత్తం 1,283 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది.

నారా భువనేశ్వరి పుత్రోత్సాహం

యువగళం పాదయాత్ర 100వ రోజు కుమారుడు లోకేశ్‌తో కలిసి నారా భువనేశ్వరి ఉత్సాహంగా నడిచారు. ఉదయం క్యాంపు సైటు నుంచి పైలాన్‌ ఆవిష్కరణ తర్వాత భోజనం క్యాంపు వరకు నడిచారు. మళ్లీ సాయంత్రం 5 గంటలకు పాదయాత్రలో పాల్గొన్నారు. మొత్తం మీద వందో రోజు నారా లోకేశ్‌తో 14 కిలోమీటర్లు భువనేశ్వరి నడిచారు. పాదయాత్ర తీరును, ప్రజలతో మమేకమయ్యే విధానాన్ని, ప్రజా సమస్యలను విని లోకేశ్‌ ఇచ్చే భరోసాను భువనేశ్వరి ఆసక్తిగా గమనించారు. లోకేశ్‌ పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి పుత్రోత్సాహంతో భువనేశ్వరి పొంగిపోయారు. నారా భువనేశ్వరి పాదయాత్రగా సాగుతుండగా ఆమె షూ లేస్‌ ఊడిపోయాయి. దీంతో లోకేశ్‌ మోకాళ్ల మీద కూర్చొని తల్లి షూలేస్‌ కట్టారు. ఇక తన భర్త నారా చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు రాజకీయ వేదికలో కనిపించని భువనేశ్వరి కుమారుడు లోకేశ్‌ పాదయాత్రలో పాలుపంచుకోవడం విశేషం. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో నారా భువనేశ్వరితో పాటు లోకేశ్‌ కుటుంబ సభ్యులైన లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్‌, నందమూరి మణి, సిహెచ్‌ శ్రీమాన్‌, సీహెచ్‌ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T21:29:10+05:30 IST