Mekapati Chandrasekhar Reddy : రసవత్తరంగా ఉదయగిరి రాజకీయం.. బొల్లినేనితో మేకపాటి భేటి

ABN , First Publish Date - 2023-05-12T12:56:21+05:30 IST

ఉదయగిరి రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబు పర్యటన రోజునే, కలిగిరి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు.

Mekapati Chandrasekhar Reddy : రసవత్తరంగా ఉదయగిరి రాజకీయం.. బొల్లినేనితో మేకపాటి భేటి

నెల్లూరు : ఉదయగిరి రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబు పర్యటన రోజునే, కలిగిరి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మేకపాటి‌ టీడీపీలోకి వెళ్లేందుకు‌ లైన్ క్లియర్ చేసుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. దశాబ్ద కాలం పాటు బొల్లినేని, మేకపాటి రాజకీయ శత్రువులుగా ఉన్నారు. అలాంటిది ఇద్దరూ భేటీ అవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు సార్లు బొల్లినేనిపై మేకపాటి పోటీ చేశారు.

కొద్ది రోజుల క్రితం కూడా దుత్తలూరులో చిరకాల రాజకీయ శత్రువు అయిన మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు సాగించారు. మేకపాటి టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారనే చర్చలు అప్పట్లోనే సాగాయి. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని మేకపాటి చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది రోజుల క్రితం వైసీపీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉదయగిరి వైసీపీలో నాలుగు వర్గాలుగా విభజించి.. అధిష్టానం పెద్దలు పాలించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిష్టానంలో పలికే నాధుడే లేడని, సచివాలయంలో ఏ అధికారిని కదిలించినా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని అన్నారు. బటన్ నొక్కితే సీఎం జగన్‌కే పేరని.. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తేనే ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటేయడంతో ఆమె గెలిచారు. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరని ఆరాతీసిన అధిష్ఠానం కనిపెట్టేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల గురించి వైసీపీ పెద్దలు సమాలోచనలు చేసి చివరికి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

Updated Date - 2023-05-12T13:48:58+05:30 IST