Share News

Vijayawada: జీవీయల్ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-11-23T12:46:24+05:30 IST

విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పెద్ద పార్టీలే కానీ ఆంద్రప్రదేశ్‌లో నెగటివ్ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు.

Vijayawada: జీవీయల్ వ్యాఖ్యలపై సిపిఐ నేత రామకృష్ణ ఏమన్నారంటే..

విజయవాడ: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత (CPI Leader) రామకృష్ణ (Ramakrishna) కౌంటర్ ఇచ్చారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) రెండు పెద్ద పార్టీలే కానీ ఆంద్రప్రదేశ్‌లో నెగటివ్ ఓట్లలో పెద్ద పార్టీ బీజేపీయేనని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు విషయంలో బీజేపీ, జగన్ కలిసే జైలుకు పంపారని విమర్శించారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు (BJP Blackmail Politics) చేస్తున్నారని ఇదివరకే చెప్పాం.. ఢిల్లీలో మీరు చేస్తుందేంటి.. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి 6 నెలలుగా జైలులో ఉన్నారని.. ఎమ్మెల్సీ కవిత, విజయసాయి అల్లుడు అదే కేసులో బయట ఉన్నారని, బీజేపీ మద్దతు లేకపోతే బయట ఉంటారా? అని ప్రశ్నించారు.

బీజేపీ కూడా ఒకానొక సమయంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, తమకు ఇప్పుడు ఇద్దరే ఉన్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయినా మేము ప్రజల తరుపున నిలబడి పోరాడతామని, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా గెలిపిస్తారని అన్నారు. ఎంతో మంది ఆంధ్రులు కమ్యూనిస్టులుగా ఆత్మగౌరవం కోసం పోరాడారని, మీలాంటి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడమని రామకృష్ణ స్పష్టం చేశారు.

ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జనసేన, బీజేపీ బంధంపై ఎలక్షన్లు దగ్గరపడే కొద్దీ మరింత స్పష్టత వస్తుంది. మరెవరినైనా కలుపుకోవాలా అనే దానిపై భవిష్యత్తులో చర్చిస్తాం. జనసేన పొత్తుపై మాకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. 175 నియోజకవర్గాలల్లో డిసెంబర్ నుంచి మా పార్టీ బలోపేతం అవడానికి పని చేస్తుంది. ఏపీ అధ్యక్షులు ఎవరైనా మా పార్టీ అభివృద్ధికే నిర్ణయాలుంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించగల పార్టీగా బీజేపీ ఉంది. ఇండియా అలయెన్స్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తోంది. అందరూ కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా, ఇంకో నలుగురిని తెచ్చుకున్నా మోదీదే గెలుపు. బీజేపీపై ఏ పార్టీ వ్యాఖ్యలు చేసినా వారిది అభద్రతా భావమే. కమ్యూనిష్టులు దిక్కు తోచక ప్రధాని మోదీపై అనేక ఏడుపుకొట్టు మాటలు మాట్లాడుతున్నారు. కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. తెలంగాణాలో ఒకటో రెండో సీట్లు పొందారు. ఏపీలో కూడా సీట్లు కోసం కమ్యూనిష్టులు ఇలా మాట్లాడుతున్నారు’’ అని ఎంపీ జీవీఎల్ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-23T12:46:26+05:30 IST