Sajjala: సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్ రెడ్డి సిద్ధం..

ABN , First Publish Date - 2023-05-19T16:27:43+05:30 IST

సీబీఐ (CBI) ముందు విచారణ కోసమే అవినాష్ రెడ్డి (Avinash Reddy) హైదరాబాద్ వెళ్లారని, సీబీఐ ముందు సాక్ష్యం చెప్పడానికి పిలిచిన 5-6 సార్లు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లారని...

Sajjala: సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్ రెడ్డి సిద్ధం..

అమరావతి: సీబీఐ (CBI) ముందు విచారణ కోసమే అవినాష్ రెడ్డి (Avinash Reddy) హైదరాబాద్ వెళ్లారని, సీబీఐ ముందు సాక్ష్యం చెప్పడానికి పిలిచిన 5-6 సార్లు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అవినాష్ తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఊహించని పరిణామంతోనే పులివెందులకు బయలు దేరారన్నారు. అవినాష్‌ను సీబీఐ అరెస్టు చేస్తారనే వార్తలు ఊహజనితాలేనని.. మరోసారి సీబీఐ విచారణకు వెళ్లేందుకూ అవినాష్ రెడ్డి సిద్దమని సజ్జల స్పష్టం చేశారు.

అవినాష్ రెడ్డికు ముందస్తు బెయిల్ కేసు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఉందని, అవినాష్ రేపైనా సీబీఐ విచారణకు హాజరవుతారని, హాజరు కావాల్సిందేనని సజ్జల అన్నారు. వివేకానందరెడ్డి (Vivekanandareddy)ని నరికిన వ్యక్తి మీడియా సమావేశాలు పెడుతూ.. బయట తిరుగుతున్నారన్నారు. ‘నేనే నరికానంటున్నవ్యక్తి బెయిల్ తీసుకుని రోడ్డుపై తిరుగుతున్నాడని’ అన్నారు. వివేకా హత్య కేసులో ఎలాంటి సంబంధంలేని వారిని వేధిస్తున్నారని, సీబీఐకి సహకరిస్తున్న బాధ్యత గల ఎంపీపై ఇలా చేస్తున్నారని, అవినాష్ రెడ్డి పారిపోతున్నట్లు చిక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని క్రియేట్ చేసే అవకాశం అవినాష్ రెడ్డికి లేదన్నారు.

అవినాష్ కారు వెనుక వెళ్లే మీడియాపై దాడి జరగడం దురదుష్టకరమని సజ్జల అన్నారు. మీడియాపై అలా దాడి జరగకూడదు... దాడి విషయం అవినాష్‌కు తెలిసి ఉండకపోవచ్చునని అన్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లుగా మీడియా వెంబడించిందన్నారు. అవినాష్ రెడ్డిని నేరస్తుడిగా చూపే ప్రయత్నించడం సరికాదన్నారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే చంద్రబాబు అధికారంలో ఉన్న మూడు నెలల్లో ఆయన్ను వదిలేవారా? అని ప్రశ్నించారు. వివేకా హత్య అనంతరం రక్తపు మరకలు ఎవరు తుడిచారో అందరికీ తెలుసునని అన్నారు. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఎవరు ఎందుకు దాచారో కూడా అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో వివేకా హత్య అనుమానితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని ఆ లోపు వ్యక్తిత్వ హననుం చేయడం సరైంది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-05-19T16:27:43+05:30 IST