TDP: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై టీడీపీ సీనియర్ నేత లేఖ

ABN , First Publish Date - 2023-04-09T19:13:42+05:30 IST

వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) లేఖ రాశారు.

TDP: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై టీడీపీ సీనియర్ నేత లేఖ

విజయవాడ: వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Acham Naidu) లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తోందన్నారు. ప్రభుత్వ ధనం జీతాలుగా ఇచ్చి పార్టీ సేవ చేయించుకోవటం దేశంలో ఇదే ప్రధమమన్నారు. వాలంటీర్లకు ఏడాదికి రూ. 2 వేలు కోట్ల ప్రజాధనం దోచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీ అభ్యర్దుల తరపున ప్రచారం నిర్వహించారని లేఖలో పేర్కొన్నారు. మంత్రుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రభుత్వ వ్యవస్ధ దుర్వినియోగంపై నోరుమెదపకుండా నిస్తేజంగా ఉన్నారని పేర్కొన్నారు. కనీసం ఒక్క జిల్లా కలెక్టర్ కూడా వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగంపై మాట్లాడకపోవటం ఆశ్చర్యం కల్గిస్తోందన్నారు. టెక్కలికి చెందిన వైసీపీ నేత పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులను గెలిపించకపోతే ఉద్యోగాలు తీసేస్తామని వాలంటీర్లను బెదిరించారని లేఖ ద్వారా ఆరోపించారు. వైసీపీ (YCP) మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలానే వాలంటీర్లను, అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ కుటుంబ సభ్యులే వాలంటీర్లుగా నియమింపబడ్డారని మంత్రులతో సహా బహిరంగంగా చెప్పారని చెప్పారు.

వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేయొద్దని గతంలో ఎన్నికల కమిషన్ ఆదేశించినా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలాది దొంగ ఓట్లను నమోదు చేయించేందుకే వాలంటీర్లను ఉపయోగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ పోస్టర్లు, కరపత్రాలు అంటించడానికి ఇంటింటికి పంచడానికి గృహసారధులతో కలిసి పని చేయాలని ఆదేశించారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య బద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమన్నారు. వాలంటీర్లు తమ జాబ్ చార్ట్ ప్రకారం వారు విధులు నిర్వహిస్తే వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన సక్రమంగా నడిచేందుకు వాలంటీర్లను కట్టడి చేయాలని సూచించారు. అలాగే నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించి వాలంటీర్ వ్యవస్ధ దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. వాలంటీర్ వ్యవస్ధను దుర్వినియోగం చేస్తూ వైసీపీ కార్యకలాపాలకు అనుమతిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లు వారి జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-09T19:13:42+05:30 IST