AP HighCourt: ఆర్ 5 జోన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-04-04T12:17:17+05:30 IST
ఆర్ 5 జోన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఆర్ 5 జోన్పై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: ఆర్ 5 జోన్ (R -5 Zone) పై విచారణను ఏపీ హైకోర్టు (AP HighCourt) వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ఆర్ 5 జోన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వెలుపల ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 1134 ఎకరాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 45పై ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. అయితే ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులపై వాదనలు వినేందుకు ఈనెల 19కి కేసు విచారణను వాయిదా వేసింది.
గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. రాజధాని భూములను వేరే అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో త్రిసభ్య ధర్మాసనం తీర్పుఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దేవదత్త కామత్, ఆంజనేయులు, ఉన్నం మురళిధర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే సుప్రీంకోర్టు (suprem Court)లో కేసు విచారణలో ఉందని అక్కడికి వెళ్ల వచ్చుగా అని అంటూ.. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే అభివృద్ది కార్యక్రమాలు అడ్డుకోవడం లేదని రాజధాని భూములు విషయంలో మాత్రమే తాము వాదనలు వినిపిస్తున్నామని న్యాయవాదులు చెప్పారు. రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులపై ఈనెల 19న విచారణ చేపడుతామని ఏపీ హైకోర్టు పేర్కొంది.