AP Assembly: చివరి రోజూ అదే సీన్.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెండ్

ABN , First Publish Date - 2023-03-24T09:46:37+05:30 IST

చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశా (AP Assembly Session)ల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

AP Assembly: చివరి రోజూ అదే సీన్.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెండ్

అమరావతి: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశా (AP Assembly Session)ల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల (TDP) ఆందోళనలతో రసాభాస చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లలో భాగంగా 30 లక్షల మందికి ఇంటి స్ధలాలు కేటాయించామని మల్లాదివిష్ణు తెలిపారు. టీడీపీ హయంలో జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మల్లాది విష్ణు వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభలో ఆందోళనకు దిగారు. పోడియం వైపు దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు నేటీతో అసెంబ్లీ సమవాశాలు ముగియనున్నాయి. 2021-22 కాగ్ రిపోర్ట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అలాగే ద్రవ్యవినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. సభలో రెండు తీర్మానాలకు సర్కార్ ఆమోద ముద్ర వేయనుంది. బోయ, వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం పంపనుంది. అలాగే కన్వర్టడ్ క్రిస్టియన్స్‌కు ఎస్సీ హోదా కొనసాగించాలంటూ కేంద్రానికి ఏపీ శాసనసభ తీర్మానం పంపించనున్నారు.

Updated Date - 2023-03-24T11:30:58+05:30 IST