గడ్డివాములో కాలిపోయిన మృతదేహం

ABN , First Publish Date - 2023-02-25T00:39:49+05:30 IST

పంట పొలం గట్టుకు ఆనుకుని ఉన్న దిమ్మపై ఉన్న పాడుపడిన పంపు షెడ్డు సమీపంలో తగలబడిన గడ్డివాములో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లా రాయవరం మండలం పసలపూడి సమీపంలో చోటుచేసుకుంది.

గడ్డివాములో కాలిపోయిన మృతదేహం

పసలపూడి చిన్న తలుపులమ్మ ఆలయం సమీపంలో ఘటన

హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌

మహిళ మృతదేహంగా అనుమానం?

రాయవరం, ఫిబ్రవరి 24: పంట పొలం గట్టుకు ఆనుకుని ఉన్న దిమ్మపై ఉన్న పాడుపడిన పంపు షెడ్డు సమీపంలో తగలబడిన గడ్డివాములో కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైన ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జిల్లా రాయవరం మండలం పసలపూడి సమీపంలో చోటుచేసుకుంది. రామచంద్రపురం-మండపేట ప్రధాన రహదారిలో మాచవరం-పసలపూడి రోడ్డులో చిన్న తలుపులమ్మ ఆలయం సమీపంలో పంట పొలాన్ని ఆనుకుని ఉన్న దిమ్మపై పాడుపడిన మోటారు షెడ్‌ ఉంది. దానిని ఆనుకుని ఉన్న మూడు గడ్డివాముల్లో ఒక గడ్డివాము తగలబడి ఉండడాన్ని కౌలు రైతు కె.గోవిందు గమనించి పొలం యజమానికి సమాచారం అందజేశారు. ఆయన రాయవరం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఆ ప్రదేశం దగ్గరలో చెప్పులు, గాజుముక్కలు ఆధారంగా మహిళ మృతదేహం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు తీసుకువచ్చి హత్యచేసి కాల్చి వేశారా అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, మండపేట రూరల్‌ సీఐ శివగణేష్‌, ఎస్‌ఐ పీవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ పరిశీలించారు. ఎస్‌ఐ ప్రశాంతి ఆధ్వర్యం లో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. పోలీసు జాగిలాన్ని తీసుకురాగా అక్కడే వున్న మరో పంట దిమ్మ వద్దకు వెళ్లి వెనక్కి వచ్చింది. రాయవరం పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో మిస్సింగ్‌ కేసులపై పోలీసులు దృష్టి సారించి కేసును ఛేదించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేశామని, సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట తరలించారు.

Updated Date - 2023-02-25T00:39:51+05:30 IST