Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను కుటుంబ వ్యథ ఇదే..!

ABN , First Publish Date - 2023-04-13T20:15:07+05:30 IST

కోడి కత్తి కేసులో నాలుగున్నరేళ్లుగా రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అప్పట్లో జగన్‌కు వీరాభిమాని.

Kodi Kathi Case: కోడి కత్తి శ్రీను కుటుంబ వ్యథ ఇదే..!

అమలాపురం: కోడి కత్తి కేసులో నాలుగున్నరేళ్లుగా రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అప్పట్లో జగన్‌కు వీరాభిమాని. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హోటల్‌లో పని చేస్తున్న సమయంలో కోడి కత్తితో జగన్‌పై శ్రీను దాడి చేశారనే అభియోగంతో ప్రస్తుతం ఎన్‌ఐఏ కేసు (NIA case)లో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Dr. BR Ambedkar Konaseema District) ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనుపల్లె తాతారావు-సావిత్రి దంపతుల చిన్న కుమారుడైన శ్రీను అలియాస్‌ కోడి కత్తి శ్రీను జీవనోపాధి నిమిత్తం విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజియన్‌ ఫుడ్‌ క్యాంటీన్‌లో సర్వర్‌ బాయ్‌గా పని చేసేవాడు. 2018 అక్టోబరు 25న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్టు (Visakhapatnam Airport)కు వచ్చారు. ఆ రోజున శ్రీనివాస్‌ టీ సర్వ్‌ చేసే క్రమంలో జేబులో ఉంచుకున్న ఫ్లవర్‌ డెకరేషన్‌కు ఉపయోగించే కోడి కత్తి మాదిరిగా ఉండే చిన్న కత్తి జగన్‌ భుజానికి తగిలి స్వల్ప గాయమైంది. చిన్న గాయమైనప్పటికీ ఎయిర్‌పోర్టు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 307 కేసుగా ఎఫ్‌ఐఆర్‌ ఫైలు చేశారు. ఆ తర్వాత ఎన్‌ఐఏ కూడా శ్రీనివాసరావుపై మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కేసు విచారణ తర్వాత అప్పట్లో నిందితుడైన శ్రీనివాస్‌ 2019 మే 25న కోర్టు బెయిల్‌పై విడుదలయ్యాడు. మళ్లీ 75 రోజుల తర్వాత 2019 ఆగస్టు 13న ఎన్‌ఐఏ అధికారులు విచారణ నిమిత్తం శ్రీనుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ జైలులో పెట్టారు. రిమాండు ఖైదీగానే గత నాలుగున్నరేళ్లుగా సెంట్రల్‌ జైలులో ఉంచారు.

చిన్నపాటి అంశాన్ని కోర్టు పరిశీలించకుండా అధికార పార్టీకి చెందిన పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు కేసు దర్యాప్తు విషయంలో అతిచేస్తూ సెక్షన్‌ 307 కేసులో నాలుగేళ్లుగా బెయిల్‌ రాకుండా ఇబ్బందులు పెడుతున్నారని... గతంలో బాధితుడి తల్లి సావిత్రి అప్పటి చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ (Chief Justice NV Ramana) దృష్టికి లేఖ ద్వారా తీసుకువెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలో అందరూ సమానమైన వారేనని చెప్పే మాటలు పేద కుటుంబాల వారికి వర్తించవనడానికి తామే సాక్ష్యమని తల్లి ఆ లేఖలో పేర్కొంది. ‘దళిత వర్గానికి చెందిన మేము నిరుపేదలం. నిత్యం కష్టపడి జీవిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. నా చిన్న కుమారుడు శ్రీనివాస్‌ చేసిన తప్పిదాన్ని పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వ పెద్దల మన్ననల కోసం బెయిల్‌ రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు’’ అని అప్పట్లో తల్లి సావిత్రి రాసిన లేఖలో సారాంశం. అయితే కోడికత్తి శ్రీనుగా ప్రసిద్ధికెక్కిన శ్రీనివాసరావు స్వతహాగా జగన్‌కు వీరాభిమానే. అప్పట్లో జగన్‌ ఫ్లెక్సులను కూడా ఇంటి వద్ద ఏర్పాటు చేసుకునేవాడు. ఎయిర్‌పోర్టు ఘటనతో పోలీసులు ఠాణేలంకలోని శ్రీనివాసరావు ఇంటిని జల్లెడ పట్టారు. అప్పట్లో ఇంటి వద్ద నున్న జగన్‌ ఫ్లెక్సులను సైతం బయటకు తీసి ఆ కుటుంబాన్ని టీడీపీ అనుచర వర్గంగా ముద్ర వేసింది. అయితే తాను జగన్‌కు వీరాభిమానిని అని, చూసేందుకు మాత్రమే వెళ్లిన క్రమంలో అనుకోని ఘటన జరిగి తన భవిష్యత్తు నాశనానికి కారణమైందని శ్రీను మీడియా ముందు, సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Updated Date - 2023-04-13T20:24:27+05:30 IST