Chandrababu: పుంగనూరులో అక్రమ కేసుల బాధిత కుటుంబాలకు చంద్రబాబు ఫోన్
ABN , First Publish Date - 2023-08-11T10:41:28+05:30 IST
జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో సంభాషించారు.
చిత్తూరు: జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఫోన్లో సంభాషించారు. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు, పుంగనూరులలో జరిగిన ఘటనల్లో పార్టీ అధినేతతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 ఎఫ్ఐఆర్లు నమోదు అవగా, 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. అలాగే ఇప్పటికే 81 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పెద్ద ఎత్తున అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అరెస్ట్ అయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని.... తప్పుడు కేసులు కోర్టులలో నిలబడవని అన్నారు. న్యాయం పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తామని అధినేత చెప్పారు. కార్యకర్తలపై అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని.. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తెస్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యుల అరెస్టులతో తల్లడిల్లుతున్న వారికి ఒక తండ్రిలా తాను అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.