AP Highcourt: జీవో నెంబర్ 24ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్ట్

ABN , First Publish Date - 2023-07-19T15:58:24+05:30 IST

ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 25 శాతం తక్కువ అడ్మిషన్‌లు ఉంటే ఫిజుల ఖరారును నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 24ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

AP Highcourt: జీవో నెంబర్ 24ను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్ట్

అమరావతి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 25 శాతం తక్కువ అడ్మిషన్‌లు ఉంటే ఫీజుల ఖరారును నిలిపివేస్తూ ప్రభుత్వం (AP Government) జారీ చేసిన జీవో నెంబరు 24ను ఏపీ హైకోర్టు (AP High Court) సస్పెండ్ చేసింది. 25 శాతం తక్కువ అడ్మిషన్‌లు జరిగాయని ఫీజుల ఖరారును నిలిపివేస్తూ జారీ చేసిన జీవోను పలు కళాశాలలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పిటీషనర్ తరపున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. 25 శాతంలోపు అడ్మిషన్‌ల ప్రతిపాదన సరైంది కాదని, దీనికి ఎటువంటి చట్టబద్ధత లేదని విజయ్ వాదించారు. చర్యలు తీసుకునేముందు కళాశాలలకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్ష ధోరణితో జీవో విడుదల చేశారని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖ తరపున స్టాండింగ్ కౌన్సిల్ సుదేష్‌ ఆనంద్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యార్ధులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని అందువల్లే ఫీజుల ఖరారును నిలిపివేశామని ఆనంద్ పేర్కొన్నారు. తక్కువ మంది విద్యార్ధులు ఉంటే అది యాజమాన్యానికి ఇబ్బందని ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో గతంలో ఇటువంటి పరిస్థితి లేదని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలు జాతీయ ర్యాంక్‌కు దూరంగా ఉన్నాయని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారు ఎక్కువమంది ఉన్నారని పేర్కొంది. కళాశాలలను ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌కు పెట్టాలని ఆదేశిస్తూ.. జీవో నెంబరు 24ను హైకోర్టు సస్పెండ్ చేసింది.

Updated Date - 2023-07-19T15:58:24+05:30 IST