ABN Effect: వింత సర్క్యూలర్‌‌‌పై విమర్శలు.. ఎస్కేయూ వీసీ నిర్ణయమిదే...

ABN , First Publish Date - 2023-02-20T12:37:25+05:30 IST

జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ABN Effect: వింత సర్క్యూలర్‌‌‌పై విమర్శలు.. ఎస్కేయూ వీసీ నిర్ణయమిదే...

అనంతపురం: జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ (Srikrishna devarayala University) లో మృత్యుంజయ హోమం (Mrutyunjaya Homam) వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మృత్యుంజయ హోమానికి చందాలు ఇవ్వాలన్న రిజిస్టార్ ఉత్తర్వులను ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) వెలుగులోకి తీసుకువచ్చి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల జడివానకు జంకి వీసీ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శ్రీకృష్ణదేవరాయల యూనివర్శిటీలో ఈనెల 24న మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు ఎస్కేయూ వీసీ ఆదేశాల మేరకు ఎస్కేయూ రిజిస్టార్ సర్క్యులర్ జారీ చశారు. దీనిపై ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురితం చేసింది. దీంతో హుటాహుటిన ఎస్కేయూ వీసీ, పాలకమండలి సభ్యులు సమావేశమై మృత్యుంజయ హోమంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృత్యుంజయ హోమంపై ఎస్కేయూ వీసీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎస్కేయూలో ఇటీవల వరుస మరణాలతో మృత్యుంజయ హోమం చేయాలని రిజిస్టార్ నిర్ణయించారు. ఇటీవల కాలంలో 25 మంది దాకా వివిధ కారణాలతో సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనెల 24న ఎస్కేయూ క్రీడా వేదికలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎస్కేయూ రిజిస్ట్రార్ వింత ఉత్తర్వులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మృత్యుంజయ హోమం చేస్తే మరణాలు ఆగిపోతాయా... విశ్వవిద్యాలయంలో హోమం చేయడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. మృత్యుంజయ హోమం జరిపేందుకు టీచింగ్‌ సిబ్బంది రూ. 500, నాన్ టీచింగ్ రూ.100లు విరాళాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంపై విద్యార్థి సంఘాలతో పాటు హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎస్కేయూ వద్ద విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా.. ఇప్పటికే ఎస్కేయూలో వీసీతో పాటు రిజిస్టార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఈనెల 24న మృత్యుంజయ హోమం జరుపుతున్నట్లు ఆదేశాలు జారీ చేయడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-20T12:45:43+05:30 IST