Harish Rao: నల్గొండలో నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాదంపై హరీష్రావు స్పందన
ABN , First Publish Date - 2022-12-12T12:06:15+05:30 IST
జిల్లాలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు స్పందించారు.
నల్గొండ: జిల్లాలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు (Telangana Minister Harish Rao) స్పందించారు. ఘటన జరిగిన విషయం తెలియగానే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికి ప్రాణాపాయం లేదని మంత్రికి వైద్యాధికారులు వివరించారు. గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని, బాగా చూసుకోవాలని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను మంత్రి హరీష్రావు ఆదేశించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే...
కాగా.. ఈరోజు ఉదయం హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై తాటికల్ సూరారం వైపు వెళ్లే సర్వీస్ రోడ్డులో నర్సింగ్ విద్యార్థుల బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. పలువురు నర్సింగ్ విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట పీజీఎఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బస్సులో నల్గొండకు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది.