Dhaka Test: టపటపా రాలుతున్న భారత్ వికెట్లు.. ఓటమి అంచున టీమిండియా!

ABN , First Publish Date - 2022-12-25T09:50:55+05:30 IST

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో టీమిండియా (Team India) పూర్తిగా కష్టాల్లో

Dhaka Test: టపటపా రాలుతున్న భారత్ వికెట్లు.. ఓటమి అంచున టీమిండియా!
Team India

బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో టీమిండియా (Team India) పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

ఓవర్ నైట్ స్కోరు 45/4తో ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓవర్ నైట్ స్కోరు 11 పరుగులు జోడించాక జయదేవ్ ఉనద్కత్ (13) (Jaydev Unadkat)ను షకీబల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో భారత్ ఆశలన్నీ రిషభ్ పంత్‌పైకి చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేజార్చుకున్న పంత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆదుకుంటాడని, భారత్‌ను విజయ తీరాలకు చేరుస్తాడని అభిమానులు భావించారు. అయితే, వారి ఆశలు అడియాసలే అయ్యాయి. 9 పరుగులు మాత్రమే చేసి మెహిదీ హసన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయి పెవిలియన్ చేరాడు.

అప్పటికి భారత్ స్కోరు 71 పరుగులు. మరో మూడు పరుగుల తర్వాత అభిమానుల్లో ఆశలు నింపిన అక్షర్ పటేల్ (34) కూడా అవుటయ్యాడు. దీంతో 74 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన టీమిండియా ఓటమి అంచున నిలిచింది. బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ (Mehidy Hasan) 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు.

Updated Date - 2022-12-25T10:33:27+05:30 IST