Kollywood: ముదురుతోన్న ‘వారసుడు’ వివాదం.. టాలీవుడ్‌పై ఫైర్

ABN , First Publish Date - 2022-11-19T13:22:16+05:30 IST

తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వారసుడు’/ ‘వారిసు’. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా

Kollywood: ముదురుతోన్న ‘వారసుడు’ వివాదం.. టాలీవుడ్‌పై ఫైర్
Vijay in Vaarasudu Movie

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay), టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli) దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తోన్న చిత్రం ‘వారసుడు’/ ‘వారిసు’ (Vaarasudu/Varisu). ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇది స్ట్రయిట్ చిత్రం కాదని, తెలుగు పరంగా ఇది డబ్బింగ్ చిత్రమే అని వారే అధికారికంగా ప్రకటించారు. కానీ.. టాలీవుడ్‌లో సంక్రాంతికి విడుదల కాబోయే చిత్రాల విషయంలో ఈ డబ్బింగ్ సినిమాకి ఎక్కువగా థియేటర్లు కేటాయిస్తున్నారనేలా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధికారికంగా స్పందిస్తూ.. గతంలో దిల్ రాజు చెప్పిన మాటలను ఇప్పుడు కూడా అమలు చేయాలని కోరింది. సంక్రాంతి, దసరా వంటి పండుగలకు విడుదలయ్యే సినిమాల విషయంలో ముందు స్ట్రయిట్ సినిమాలకు థియేటర్లు కేటాయించిన తర్వాతే.. డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు కూడా అలాగే కేటాయించాలని నిర్మాతల మండలి కోరింది. దీనిపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతోంది.

సంక్రాంతికి చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఈ చిత్రాలకు కాకుండా దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ చిత్రానికి థియేటర్లు ఎక్కువగా కేటాయింపు జరుగుతుందనేలా వస్తున్న వార్తలని ఉద్దేశిస్తూ.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నుంచి ఈ అధికారిక ప్రకటన రాగా.. ఇప్పుడిదే తమిళ దర్శకుల ఆగ్రహానికి కారణమవుతోంది. మీరు మా సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే.. మీ సినిమాలకు మేమూ ఇవ్వం.. అంటూ కొందరు కోలీవుడ్ (Kollywood) దర్శకులు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ ప్రకటిస్తుండటంతో.. ఈ వివాదం మరింతగా ముదురుతోంది. తెలుగు సినిమాలను ఇక్కడ (కోలీవుడ్) ఆదరిస్తుంటే.. తమిళ సినిమాలను ఆపడం ఏమిటంటూ.. తమిళ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై చర్చలు జరిపేందుకు ఈ నెల 22న తమిళ నిర్మాతల భేటీ కాబోతున్నారనేది తాజా సమాచారం. ఇదిలా ఉంటే.. తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత అల్లు అరవింద్ అభ్యంతరం చెప్పడం ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారింది. డబ్బింగ్ సినిమాలను ఆపడం సాధ్యమయ్యే పనికాదన్న.. ఆయన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Updated Date - 2022-11-19T13:34:05+05:30 IST