Gujarat Results : గుజరాత్‌లో బీజేపీ గెలుపు... మోదీపై ఉద్ధవ్ శివసేన ప్రశంసలు...

ABN , First Publish Date - 2022-12-09T16:07:24+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆ రాష్ట్రంలో

Gujarat Results : గుజరాత్‌లో బీజేపీ గెలుపు... మోదీపై ఉద్ధవ్ శివసేన ప్రశంసలు...
Narendra Modi, Uddhav Thackeray

ముంబై : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ విజయంలో మహారాష్ట్ర పాత్ర ఉందని వ్యాఖ్యానించింది. అభివృద్ధి ప్రాజెక్టులను మహారాష్ట్ర నుంచి లాక్కుని గుజరాత్‌లో పెట్టడం వల్ల బీజేపీకి ప్రతిఫలం లభించిందని పేర్కొంది. శివసేన పత్రిక ‘సామ్నా’ శుక్రవారం సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

డిసెంబరు 1, 5 తేదీల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలోని 182 స్థానాల్లో 156 స్థానాలు బీజేపీకి లభించాయి. ఇది ఆ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డ్. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన స్పందిస్తూ, ఈ చరిత్రాత్మక విజయంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో స్థాపించాలని నిర్ణయించిన అభివృద్ధి ప్రాజెక్టులను గుజరాత్‌కు తీసుకెళ్ళడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంది. ఈ ధోరణిని శివసేన పత్రిక ‘సామ్నా’ శుక్రవారం కూడా కొనసాగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, ఇటీవల మోర్బిలో వంతెన ప్రమాదం జరిగినపుడు గుజరాత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నప్పటికీ, బీజేపీ విజయం సాధించడం ఆశ్చర్యకరమేమీ కాదని పేర్కొంది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అభివృద్ధి ప్రాజెక్టులను లాక్కోవడం వల్ల ఫలితం దక్కిందని ఎద్దేవా చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని గౌరవ్ పురుష్ అని ఈ సంపాదకీయం అభివర్ణించింది. ఆయన గుజరాత్‌‌కు గర్వకారణమని పేర్కొంది. ఆయన వల్లే ఆ రాష్ట్రం నిదానంగా అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపింది. ఆ రాష్ట్రంలో అనేక గ్లోబల్ మీట్స్ నిర్వహించారని, ప్రపంచ నేతలు సబర్మతి, అహ్మదాబాద్‌లను సందర్శించారని, అందుకు కారణం మోదీయేనని తెలిపింది. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులను లాక్కుని గుజరాత్‌లో ఏర్పాటు చేశారని పేర్కొంది.

Updated Date - 2022-12-09T16:07:30+05:30 IST