Heeraben Modi: అమ్మను పరామర్శించిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-12-28T18:03:04+05:30 IST

తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి, ఆమెకు అందుతున్న చికిత్స గురించి మోదీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Heeraben Modi: అమ్మను పరామర్శించిన ప్రధాని మోదీ
PM Narendra Modi returns after meeting his mother Heeraben Modi

అహ్మదాబాద్: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తల్లి హీరాబెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్న ప్రధాని తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, ఆమెకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 80 నిమిషాల పాటు ప్రధాని ఆసుపత్రిలో గడిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ కూడా ప్రధాని వెంట ఉన్నారు.

ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్ శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గత జూన్‌లో హీరాబెన్ 99వ పుట్టినరోజుకు కూడా మోదీ హాజరయ్యారు. నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్న తన తల్లి గురించి 'మదర్' అనే టైటిల్‌తో మోదీ ఒక ఎమోషనల్ బ్లాగ్ కూడా రాశారు. ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని మైసూరులో కారు ప్రమాదంలో గాయపడిన కొద్ది గంటలకే హీరాబెన్ ఆసుపత్రిలో చేరడం వారి ఆత్మీయులను ఆందోళనకు గురిచేసింది.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బాసటగా నిలిచారు. మోదీ తల్లి హీరాబెన్ (Heeraben Modi) అస్వస్థతకు గురై అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో తల్లీ కొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిదంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో మోదీ వెంటే తానుంటానన్నారు. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలంటూ రాహుల్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మోదీ తల్లి త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-12-28T18:08:46+05:30 IST